కిలారికి కితకితలు : అక్కడ పార్టీలు లేవు...ఆయనే టార్గెట్..?

Update: 2022-05-29 02:30 GMT
వైసీపీకి ఉమ్మడి గుంటూరు జిల్లా 2019 ఎన్నికల్లో బాగా కలసి వచ్చింది. మెజారిటీ సీట్లను సాధించింది. అలా అక్కడ ఒక బిగ్ షాట్ లాంటి నేత కూడా ఓటమి పాలు అయ్యారు. ఆయనే పొన్నూరు నియోజకవర్గానికి చెందిన ధూళిపాల నరేంద్ర. ఆయన తండ్రి నుంచి రాజకీయ వారసత్వంగా పొందారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా వరసబెట్టి గెలిచారు. నిజానికి పొన్నూరులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నా కూడా పాతికేళ్ళుగా కమ్మలు మాత్రమే గెలుస్తూ వస్తున్నారు.

అలా అక్కడ పట్టు సాధించారు నరేంద్ర. ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు మంత్రివర్గంలో ఎపుడూ చాన్స్ దక్కలేదు. ఇవన్నీ ఇలా ఉంటే 2014లో ధూళిపాళను  వైసీపీ ఓడించలేకపోయింది. వైసీపీ నుంచి రావి వెంకటరరణను బరిలోకి దించింది. ఇద్దరూ ఒకే సామాజికవర్గం. దాంతో నరేంద్ర గెలిచేశారు.

ఈసారి అలా కాదు అనుకుని కాపుల నుంచి కిలారి రోశయ్యను దించింది. ఆయన ఎవరో కాదు వైసీపీలో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. రోశయ్య ఫస్ట్ టైమ్ లోనే ఎమ్మెల్యే అయిపోయారు. పైగా ధూళిపాల మీద నెగ్గడం విశేషం. ఆయనకు సామాజికవర్గం దన్ను కూడా కలసివచ్చింది. ఇక రోశయ్య మూడేళ్ళ కాలంలో తనదైన శైలిలో నియోజకవర్గంలో పట్టుసాధించారు.

వైసీపీ హైమాండ్ ఆలోచనల బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ అని అంటున్నారు. దాంతో అసంతృప్తికి గురి అయిన రావి వెంకట రమణ రోశయ్య మీద సొంత పార్టీలో ఉంటూ కత్తులు దూస్తున్నారు అని ప్రచారం మొదలైంది. ఆయన సొంత పార్టీ నేత మీదనే విమర్శలు చేస్తున్నారుట. అంతే కాదు ఈ మధ్య రోశయ్యకు వ్యతిరేకంగా రావి మద్దతుదారులు అంతా భారీ సమావేశం నిర్వహించారు.

ఆ సమావేశానికి టీడీపీ కూడా సహాయం చేసింది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ టికెట్ రాదు కాబట్టి లోపాయికారీగా ధూళిపాళకు సహకరించాలని రావి ఫిక్స్ అయిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం మొత్తం దగ్గర ఉంచుకున్న రోశయ్య పార్టీలో రావి చేస్తున్న కార్యక్రమాలను ఒక కంట కనిపెడుతున్నారుట.

ఈ నేపధ్యంలో రోశయ్య తన బలాన్ని పెంచుకోవడమే కాకుండా రావి ప్లస్ ధూళిపాళ బలాన్ని కూడా తగ్గించాలని చూస్తున్నారుట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రోశయ్యను ఓడించాలని ధూళిపాళ చేస్తున్న ప్రయత్నాలకు రావి మద్దతు ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియదు కానీ కిలారికి మాత్రం కితకితలు మొదలయ్యాయని అంటున్నారు. ఈసారి కూడా ఆయన గెలిచి నిలిస్తే పొన్నూరు మొనగాడు అనిపించుకుంటారని లేకపోతే ధూళిపాళ వ్యూహం ముందు చిత్తు అయినట్ల అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News