చంద్రబాబును చూసి దేవాంశ్ జడుసుకుంటున్నాడట

Update: 2016-04-29 07:38 GMT
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ తన తాత చంద్రబాబును చూసి బెదిరిపోతున్నాడట. తాతను చూడగానే బిగ్గరగా ఏడుపు లంకించుకుని నాన్న లోకేశ్ వద్దకు పారిపోతున్నాడట. ఈ సంగతి స్వయంగా లోకేశే తనకు చెప్పారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు.

ఇప్పటికే జేసీ దివాకరరెడ్డి వంటివారు చంద్రబాబు పూర్తిగా రాష్ట్రం కోసమే సమయం కేటాయిస్తూ ఇంటిని మర్చిపోతున్నారని అన్న విషయం తెలిసిందే. ఆ తరువాత చంద్రబాబు కూడా అదే విషయం చెప్పారు. అయితే.. చంద్రబాబు రాష్ట్రం కోసం తపిస్తూ ఇంటిని మర్చిపోవడమన్నది ఏ స్థాయికి వెళ్లిందో గంటా ఉదాహరణతో సహా వివరించారు.

ఇటీవల కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. పెళ్లికి వెళ్లిన తరువాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన చంద్రబాబు అక్కడ తన మనవడు దేశాంశ్ ను చూసి ముచ్చటపడి ఎత్తుకోబోయారట. దేవాంశ్ వద్దకు వెళ్లి చేతులు చాపి ‘‘రామ్మా.. చిన్నా’’ అంటూ పిలిచారట. అంతే... దేశాంశ్ కెవ్వుమని ఏడుస్తూ చంద్రబాబుకు దూరంగా జరిగి లోకేశ్ వద్దకు వెళ్లిపోయాడట. చంద్రబాబు తరచూ ఇంటికి వెళ్లకపోవడం వల్ల మనవడు దేవాంశ్ ఆయన్ను మర్చిపోతున్నాడని.. గుర్తుపట్టలేకపోవడం వల్ల ఎవరో అనుకుని ఏడుస్తున్నాడని చెబుతున్నారు. చంద్రబాబు రాష్ట్రం కోసం అహర్నిశలూ పనిచేస్తూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని చెప్పడానికి గంటా ఈ సందర్భాన్ని ఉదహరించారు.
Tags:    

Similar News