ముద్రగడ దీక్ష ముగింపుకు కౌంట్ డౌన్

Update: 2016-02-08 07:12 GMT
ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరాహార దీక్ష ఈ రోజుతో ముగిసేలా చేస్తారా?...  తాజా పరిణామాలన్నీ  అందుకు అవుననే సమాధానమే వచ్చేలా ఉన్నాయి.  ముద్రగడ దీక్ష సోమవారంతో నాలుగో రోజుకు చేరింది. ఇప్పటికే తోట త్రిమూర్తులు - బొడ్డు భాస్కరరామారావు వంటి టీడీపీ నేతలు ముద్రగడతో ఒక విడత చర్చలు జరిపారు. సోమవారం ఉదయం ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు - ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకటరావులు ప్రభుత్వం తరఫున ముద్రగడతో చర్చలు ప్రారంభించారు. దీంతో చంద్రబాబు తరఫున వారేదైనా హామీ పట్టుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు.  ముద్రగడ కూడా ప్రభుత్వం హామీ ఇస్తే తాను ఒక మెట్టు దిగేందుకు సిద్ధమని దీక్ష తొలిరోజునే ప్రకటించారు. దీంతో తాజాగా ప్రభుత్వం, ముద్రగడ కూడా ఒక మెట్లు దిగుతారని... దాంతో ముద్రగడ దీక్షకు ముగింపు పలికి ఉద్రిక్తతలు చల్లారేలా చేస్తారని అనుకుంటున్నారు.

మరోవైపు ముద్రగడ దీక్ష ఫలితంగా రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. రిజర్వేషన్లు కావాలని కాపులు, వారికి ఇవ్వొద్దంటూ బీసీలు ఇలా ఎవరికి వారు ఉద్యమాలు అంటూ రెడీ అవుతున్నారు. ముద్రగడ దీక్షకు మద్దతిచ్చి తమ సామాజికవర్గంలో పట్టు కోల్పోకుండా నిలవాలన్న ఉద్దేశంతో కాపు నేతలూ ముద్రగడ ఇంటికి క్యూ కడుతున్నారు. సోమవారం చిరంజీవి - దాసరి - రఘువీరా వంటివారు ముద్రగడ వద్దకు వస్తున్నారు. వారిని అడ్డుకుంటే ఒక సమస్య... అడ్డుకోకుండా వదిలేస్తే మరో సమస్య... వారు అక్కడ ఏమైనా తీవ్ర కామెంట్లు చేస్తే అది ఎలాంటి విధ్వంసాలకు దారితీస్తుందో తెలియని పరిస్థితి.  ఈ క్రమంలో దాసరిని ఇప్పటికే రాజమండ్రిలో ఆపేశారు. అది కూడా ముద్రగడ దీక్ష ముగింపు ప్రయత్నాలకు ఊతమిస్తోంది.

మరోవైపు ముద్రగడ వైద్య పరీక్షకులకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కూడా తెలియదు. ఆయనకు ఏమైనా అయితే పరిస్థితులు చేయి దాటిపోతాయి. వీటన్నిటి నేపథ్యంలో ముద్రగడ దీక్షకు ఎలాగైనా సోమవారం ముగింపు పలకాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ముద్రగడకు ఏదైనా హామీ ఇచ్చి విరమింపజేయడం కానీ... లేదంటే బలవంతంగానైనా కానీ దీక్షకు ముగింపు పలకాలని ప్రభుత్వం డిసైడైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం హామీలకు ముద్రగడ సరే అంటే మధ్యాహ్నానికే శుభం కార్డు పడే సూచనలున్నాయి.
Tags:    

Similar News