పవన్ కళ్యాణ్ కు అధికారమే ముఖ్యం: కేఏపాల్

Update: 2020-01-17 11:36 GMT
మొన్నటి ఏపీ ఎన్నికల వేళ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏపాల్ పంచిన వినోదం అంతా ఇంతాకాదు. తనదైన చేష్టలు, వింతైన హావభావాలు, సంచలన వ్యాఖ్యలతో కేఏపాల్ వార్తల్లో నిలిచారు. ఎన్నికలు ముగియడంతో అమెరికా వెళ్లిపోయారు. ఆడపాదడపా మాత్రమే వీడియోలు విడుదల చేస్తూ కనిపిస్తున్నారు.

తాజాగా మరోసారి ఏపీ పాలిటిక్స్ లో వేలు పెట్టారు. బీజేపీ-జనసేన పొత్తుపై కేఏపాల్ స్పందించారు. సంచలన వ్యాఖ్యలతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ కు అధికారమే ముఖ్యమని కేఏపాల్ వ్యాఖ్యానించారు.  ఆయన పవర్ కోసమే పార్టీ పెట్టారని.. ఈ విషయాన్ని తాను 2019 ఎన్నికలకు ముందే చెప్పినా ఎవరూ నమ్మలేదన్నారు. పవన్ ను చూస్తే విచారంగా ఉందని.. కాపులు కూడా ఆయనకు ఓటు వేయలేదని వాపోయారు.

చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ ఏజెంట్ అని తాను అన్నా ఎవరూ పట్టించుకోలేదని.. ఓ ఎంపీ, మంత్రి పదవి కోసమే చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారని కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కు కనీసం 5శాతం ఓట్లు కూడా రావని చెప్పానని.. అంతే వచ్చాయని తెలిపారు. పవన్ ఎన్నికలకు ముందు మాయవాతి కాళ్లు పట్టుకున్నాడని.. ఇప్పుడు మోడీ షా కాళ్లు పట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెప్పి హోదా తీసుకొస్తే ప్రజలు ప్రశంసిస్తారని తెలిపారు. మొన్నటి వరకూ చంద్రబాబుతో ఉండి.. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఏంటని కేఏ పాల్ ప్రశ్నించారు. జగన్ పై నిందలు వేసి తప్పు చేస్తున్నాడని పవన్ పై మండిపడ్డారు. 2024లో ఎన్నికలు ఉంటే ఇప్పుడు పొత్తులేంటి అని నిలదీశారు.

    

Tags:    

Similar News