తెలంగాణ వ్యక్తిని ఓఎస్డీగా పెట్టుకున్న బాబు

Update: 2016-05-25 04:52 GMT
తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని తానింకా పాటిస్తున్నట్లుగా తన తాజా చర్యతో మరోసారి స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమేనన్న విషయాన్ని తన తాజా చర్యతో మరోసారి నిరూపించారు. పదేళ్ల తర్వాత తనకు అధికారం ఇచ్చిన ఏపీ ఎలానో.. తనకు అధికారం ఇవ్వని తెలంగాణ రెండూ ఒక్కటేనన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఏమాత్రం అవకాశం లభించినా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు తాజాగా ఒక కీలక పదవిని తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇవ్వటం గమనార్హం.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక జర్నలిస్ట్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ తేలప్రోలు శ్రీనివాసరావును దేశరాజధాని ఢిల్లీలో మీడియా రిలేషన్స్ ను చూసేందుకు నియమితులు కావటం గమనార్హం.

కాంట్రాక్ట్ పద్ధతిన ఎంపిక చేసిన శ్రీనివాసరావు పదవి రెండేళ్ల పాటు సాగనుంది. జాతీయ స్థాయిలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న విధానాలకు విశేష ప్రచారం కల్పించటమే లక్ష్యంగా శ్రీనివాసరావు నియామకం జరిగినట్లుగా చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది సీమాంధ్రుల కారణమైనప్పటికీ కొన్ని పదవులు మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వటంపై కొందరు ఏపీ తమ్ముళ్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News