దిల్ రాజు కల నెరవేరబోతోందా?

Update: 2019-06-22 16:39 GMT
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు వేంకటేశ్వరరామికి పరమ భక్తుడన్న సంగతి ఇండస్ట్రీ జనాలకు బాగా తెలుసు. తన బేనర్‌కు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అని పేరు పెట్టుకోవడమే కాదు.. బేనర్ లోగో పడగానే మము కొలుచువాడు అంటూ పాట కూడా వేయిస్తాడు రాజు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం - తరచుగా తలనీలాలు సమర్పించడం రాజుకు అలవాటు. ఏటా ఆయన తన స్వస్థలం నిజామాబాద్‌ లో పది రోజుల పాటు వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు కూడా జరిపిస్తుంటారు. శ్రీనివాసుడికి ఇంతటి భక్తుడైన రాజుకు రాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడు కావాలని ఎప్పట్నుంచో కల. ఆ కల ఇప్పుడు నెరవేరబోతున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాజుకు మార్గం సుగమం అయిందట. టీటీడీ బోర్డును పూర్తిగా మారుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ బంధువు - వైకాపాలో కీలక నేత అయిన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలోని టీటీడీ బోర్డులో రాజు కూడా సభ్యుడు అవుతున్నాడట. తెలంగాణ మంత్రి కేటీఆర్ సిఫారసు మేరకు రాజు సభ్యత్వానికి జగన్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాజుది రెడ్డి సామాజిక వర్గం కావడం కూడా ఇక్కడ కలిసొస్తున్న అంశంగా చెప్పుకుంటున్నారు. తన ఆరాధ్య దైవం సన్నిధిలో పని చేసే అవకాశం లభిస్తున్నందుకు రాజు ఎంత సంతోషంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



Tags:    

Similar News