జగన్ కి అర్ధమైంది... ఎమ్మెల్యేలకు కావాలి

Update: 2022-09-29 02:30 GMT
ఈసారి ఎన్నికలు ఏపీలో చాలా భిన్నంగా ఉంటాయన్న సత్యం అయితే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కి ఈ విషయం బాగా అర్ధమైంది. ఈసారి ఎన్నికలను ఎదుర్కోవడానికి తన ఇమేజ్ ఒక్కటే సరిపోదు అని కూడా ఆయనకు బాగా తెలిసింది. అయితే అర్ధం కానిది మాత్రం ఆ పార్టీ జనాలకే. వారు మరోసారి 2019 ఎన్నికల నాటి గాలి బలంగా వీస్తుందని అనుకుంటున్నారు.

అయితే ఆనాడు జగన్ విపక్షంలో ఉన్నారు. ఆయన పాలన గురించి జనాలకు తెలియదు. ఆయన ఎలా పాలన చేస్తారో ఒక చాన్స్ ఇద్దామని చూశారు. కానీ 2024లో ఎన్నికలు మాత్రం జగన్ ఏమిటి అన్నది జనాలు చూసేసిన తరువాత ఇవ్వ‌బోయే తీర్పు.  జగన్ పాలన ఏమిటి అన్నది కూడా వారికి బాగా అర్ధమైంది. ఆయన పాలనలో సంక్షేమం గురించే చెప్పుకోవాలి.

అయితే ఇది కూడా అందరికీ అందడంలేదు. అలా దక్కని వారు కచ్చితంగా రివర్స్ లో ఓటేస్తారు. ఇక అభివృద్ధి కోరుకునే వారుంటారు. వారివి యాంటీ ఓట్లు అవుతాయి. ఉద్యోగ వర్గాలు, నిరుద్యోగ సెక్షన్ కూడా గతానికి భిన్నంగా రియాక్ట్ అవుతుంది. ఇంకో వైపు మధ్యతరగతి ఓటర్లు అయితే వైసీపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని అంటున్నారు.

ఇలా అనేక అంశాలు ప్రభావితం చేసే విధంగా 2024 ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే జగన్ ఫోటోతో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేసి ఓట్లేయమంటే జనాలు వింటారా. సో ఈ విషయాలు అన్నీ కూడా జగన్ అర్ధం చేసుకున్నారు కాబట్టే ఎమ్మెల్యేలను జనాల వద్దకు వెళ్ళమంటున్నారు. గడప గడప‌కూ కార్యక్రమం ఉద్దేశ్యం ఏంటి అంటే ఎమ్మెల్యేలు జనాలతో కనెక్ట్ కావడమే. సమస్యలు ఉన్నా సరే ముందు ముఖాలు చూపిస్తే ఎంతో కొంత శాంతిస్తారు, ఆ మీదట సమస్యలకు కూడా పరిష్కరించవచ్చు అన్నది జగన్ ఆలోచన అంటున్నారు.

ఇక వైసీపీ సర్కార్ ఏలుబడి మొదలయ్యాక మొదటి ఆరు నెలల సంగతేమో కానీ ఆ తరువాత కరోనా వచ్చి రెండేళ్ళ పాటు అంతా గప్ చుప్ అయ్యారు. ఎమ్మెల్యేలు అన్న వారు అయితే జనాల్లో ఆసలు ఏ కోశానా  కనిపించలేదు. దాంతో ఇపుడు తాపీగా అయినా జనాల్లోకి వెళ్ళి మార్కులు వేయించుకోమంటున్నారు. అయితే ఎమ్మెల్యేల బాధ మరో విధంగా ఉంది. తాము చేయడానికి ఏమీ లేదు, జనాలు చెప్పే సమస్యలు తీర్చడానికి నిధులు లేవు వెళ్ళి ఏం చేయాలన్నది వారి ఆవేదన.

అయినా సరే వెళ్లాల్సిందే అని జగన్ అంటున్నారు. ఈ కాయకష్టమే మిమ్మల్ని గెలిపిస్తుంది అని జగన్ అంటున్నారు. అయితే నియోజకవర్గం నిధులు మంజూరు చేస్తే తమకు బాసటగా ఉంటుందని వారు చెబుతున్నారు. మొత్తానికి జగన్ గాలి కంటే కూడా ఎమ్మెల్యేల వేవ్ మీదనే అధినాయకత్వం ఈసారి ఎన్నికల్లో  ఆధారపడుతోంది. మరి ఎమ్మెల్యేలు ఆ విధంగా పనితీరు చూపించకపోతే ఏమవుతుంది. అంటే అది రాజకీయ వెండి తెర మీద చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News