వైసీపీ టాక్: అభిమానం ఉంది.. ఆదరణే లేదు!
ఈ విషయంలో వారికి పార్టీ నుంచే మద్దతు కొరవడుతోందన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో బలం లేకుండా.. పార్టీ పుంజుకునే పరిస్థితి అయితే ఉండదు.
By: Tupaki Desk | 1 Jun 2025 4:00 AMవైసీపీ వీరాభిమాని ఒకరు అరగుండు చేయించుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తూర్పు గోదావ రి జిల్లాకు చెందిన సదరు వీరాభిమాని.. 2024 ఎన్నికల్లో పార్టీ మళ్లీ విజయం సాధించడమే కాకుండా.. వైనాట్ 175 ఖాయమని కూడా ప్రచారం చేశాడు. దీనిని అతని స్నేహితులు కొందరు అప్పట్లోనే సవాల్ చేశారు. ప్రజలంతా కూటమి వైపు ఉన్నారని.. ఈసారి వైసీపీ విజయం సాధ్యం కాదని పేర్కొన్నారు. దీంతో సదరు వీరాభిమాని.. వారితో సవాల్ రువ్వారు. వైసీపీ ఓడితే.. తాను అరగుండు చేయించుకుంటానని చెప్పారు. కానీ.. అనూహ్యమో.. లేక పార్టీ తలరాతో.. ఏమైనా కానీ.. 11 స్థానాలకు పరిమిత మైంది. దీంతో అతను ఊరు వదిలి వెళ్లి పోయాడు.
ఇటీవల అతను.. ఇంట్లో శుభకారం కోసం తిరిగివచ్చాడు. ఈ విషయం తెలిసిన అతని స్నేహితులు గత ఏడాది చేసిన శపథాన్ని అతనికి గుర్తు చేశారు. అంతేకాదు.. ''జగన్కు వీరాభిమానివైతే.. ఈ శపథం నిలబెట్టుకోవాలి'' అని వ్యాఖ్యానించారు. దీంతో ఆ వీరాభిమాని.. ఏమాత్రం సంకోచించకుండా.. అరగుండు చేయించుకుని శపథాన్ని నిలబెట్టుకున్నాడు. కట్ చేస్తే..ఏడాది కిందట ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఇలానే వీరాభిమానులు అరగుండు చేయించుకున్నా రు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పైకి కనిపించని అభిమానులు చాలా మంది ఉన్నారు.
ఈ విషయంలో వారికి పార్టీ నుంచే మద్దతు కొరవడుతోందన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో బలం లేకుండా.. పార్టీ పుంజుకునే పరిస్థితి అయితే ఉండదు. టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. ఆ పార్టీ అధికారంలోకి రావాలంటూ.. అనేక మంది ప్రార్థించారు. పూజలు కూడా చేశారు. కొందరు యాగాలు కూడా చేయించారు. అయితే.. వీరందరినీ చంద్రబాబు గుర్తు పెట్టుకు న్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేసే రోజు.. వారిని పిలిపించి.. గన్నవరంలో భోజనాలు ఏర్పాటు చేశారు. తనపట్ల అభిమానం చూపించిన వారిని చంద్రబాబు అంతే ఆదరంగా చూశారు.
కానీ.. వైసీపీ విషయంలో అభిమానులు ఉన్నారు.. అభిమానం ఉంది.. కానీ, పార్టీ నుంచి సరైన ఆదరణే వారికి లభించడం లేదన్న చర్చ సాగుతోంది. పార్టీ ఓడిపోయి ఉండొచ్చు.. లేదా.. నాయకుల్లో నైరాశ్యం ఉండొచ్చు.. కానీ, అభిమానులను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా! ఈ విషయంలోనే వైసీపీ వెనుకబాటు తనాన్ని అనుభవిస్తోంది. అంతా.. తాడేపల్లిలోని ఓ కీలక వ్యక్తికి అప్పగించేసిన దరిమిలా.. అసలు ఈ విషయాలను వారు పట్టించుకోవడమే మానేశారు. దీంతో అభిమానులు కూడా ఒక్కొక్కరుగా చెల్లాచెదరవుతున్నారు. మరి పార్టీ ఇలా అయితే.. పుంజుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికైతే సమాధానం లేదు.