బండి సంజయ్.. తక్షణమే కుమారుడిని అప్పగించాలి: రేవంత్
ఈ పరిణామాలు ఇలా సాగుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కేసుపై స్పందించారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో పైకి వచ్చిన సంజయ్.. తన కుమారుడి కారణంగా పరువు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
బండి భగీరథ్ కేసు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా స్పందించారు. ఇప్పటికే ఆయన ఈ కేసును సీరియస్గా తీసు కున్నట్టు వార్తలు వచ్చాయి. డీజీపీకి కూడా దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చారని.. కేసును తీవ్రంగా పరిగణించాలని చెప్పారని వార్తలు వచ్చినా.. ఆయన నేరుగా స్పందించలేదు. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్.. తనను లైంగికంగా వేధించాడని.. పేర్కొంటూ ఓ బాలిక(17) తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో బాలిక నుంచి వాగ్మూలం తీసుకున్న డీసీపీ రితి రాజ్.. పోక్సో కేసు నమోదుచేశారు.
అప్పటి నుంచి భగీరథ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఒకానొక దశలో ఆయనను విదేశాలకు పంపిస్తున్నా రన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో భగీరథ్పై లుకౌట్ నోటీసులు ఇవ్వాలని కోరుతూ.. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తన ప్రమేయం లేకుండానే తనపై కేసులు పెట్టారని.. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమని భగీరథ్ వ్యాఖ్యానించారు. అనంతరం.. ఆయనకు నోటీసులు ఇచ్చినా.. బుధవారం విచారణకు రాలేదు. ఈ పరిణామాలపై స్పందించిన కేంద్ర మంత్రి సంజయ్.. తొలుతదీనిని తనపై జరుగుతున్న కుట్రగాపేర్కొన్నా.. తర్వాత.. తప్పు చేస్తే తన కుమారుడైనా శిక్షకు నిలబడాలన్నారు.
ఈ పరిణామాలు ఇలా సాగుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కేసుపై స్పందించారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో పైకి వచ్చిన సంజయ్.. తన కుమారుడి కారణంగా పరువు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తన గౌరవాన్ని, మర్యాదను నిలుపుకోవాలంటే.. భగీరథ్ను సంజయ్ తక్షణమే పోలీసులకు అప్పగించాలని రేవంత్ రెడ్డి సూచించారు. చట్టం ముందు ..తనకోరూలు, సామాన్యులకు ఒక రూలు అన్నట్టుగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని చెప్పారు. భగీరథ్ తప్పు చేశాడా.. లేదా అనేది విచారణ అధికారులు దర్యాప్తులో తేలుస్తారని.. కోర్టుల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు.
బాధ్యతాయుత స్థానంలో ఉన్న బండి సంజయ్..తన కుమారుడిని పోలీసులకు అప్పగించడం ద్వారా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. తన కుమారుడు చేసింది తప్పయినా.. ఒప్పయినా.. నిలబడి సమాజానికి, న్యాయ, చట్ట వ్యవస్థలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంజయ్పైనే ఉంటుందని తెలిపారు. దీనిని విస్మరిస్తే.. తెలంగాణ సమాజం ఆయనను ఎప్పటికీ క్షమించదని అభిప్రాయపడ్డారు. కొడుకును అప్పగించి.. తన గౌరవాన్ని తానే పెంచుకోవచ్చని.. పారిపోతే.. అది మరింత జఠిలం అవుతుందని చెప్పారు. ఇప్పటికైనా సంజయ్ .. తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని సూచించారు.