ఒక్కొక్క 'బిల్లు'ది ఒక్కొక్క చరిత్ర!
అయితే.. విశాల జన హితాన్ని దృష్టిలో పెట్టుకుని తాము ఈ మూడు బిల్లులను తీసుకువచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.;
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు కేవలం మూడు కీలక బిల్లులను ఆమోదించుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువ చ్చింది. వీటి వెనుక రాజకీయం ఉందన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. అయితే.. విశాల జన హితాన్ని దృష్టిలో పెట్టుకుని తాము ఈ మూడు బిల్లులను తీసుకువచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా.. ఒక్కొక్క బిల్లు వెనుక ఒక్కొక్క చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఇవీ.. బిల్లులు..
1) లోక్సభలో డీలిమిటేషన్: 131వ రాజ్యాంగ సవరణ కింద తీసుకువచ్చిన లోక్సభలో డిలిమిటేషన్ బిల్లు-2026 ద్వారా.. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాలను 850 సీట్లకు పెంచాలన్న ఉద్దేశం ఉంది. తద్వారా.. పెరగనున్న 270 పైచిలుకు సీట్లను కేవలం మహిళలకు కేటాయించనున్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్కు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం ఈ పెరుగుతున్న సీట్లను వారికే కేటాయించాలని నిర్ణయించింది. అయితే.. పెరుగుతున్న సీట్లే కాదు.. ప్రస్తుతం ఉన్న పురుష సీట్లలోనూ తమకు వాటా కావాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది.
2) కేంద్ర పాలిత ప్రాంతాల పునర్విభజన: ప్రస్తుతం దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలైన.. పుదుచ్చేరి, ఢిల్లీ, అండమాన్ సహా.. పలు రాష్ట్రాల్లోని పార్లమెంటు సీట్లను పునర్విభజించనున్నారు. వాస్తవానికి ఇవి రాష్ట్రాలతో సమానంగా జరగవు కాబట్టి.. మొత్తం పాలన అంతా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటున్న నేపథ్యంలో ఈ బిల్లును ప్రతిపాదించారు. తద్వారా.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్లమెంటు స్థానాలు పెరగనున్నాయి. ఈ సంఖ్య 35కు చేరుకోనుంది.
3) డీలిమిటేషన్: ఇది రాష్ట్రాల్లో అసెంబ్లీస్థానాలను పెంచే బిల్లు. దీనివల్ల ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడున్న స్థానాలు 50 శాతం మేరకు పెరగనున్నాయని కేంద్రం చెబుతోంది. ఫలితంగా ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొంటోంది. అయితే.. ఈ బిల్లును విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. జనాభా లెక్కలు తీయకుండా.. 2011 నాటి లెక్కలతో చేపడుతున్న క్రమంలో ఇది దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తుందని.. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి మేలు కలిగేలా ఉందని పేర్కొంటున్నాయి.