సింగయ్య మృతికి కారణం జగన్‌ వాహనమే... ఫోరెన్సిక్ సంచలనం!

అవును... జగన్ పర్యటన సందర్భంగా వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.;

Update: 2025-07-01 05:16 GMT

జూన్‌ 18న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన కేసులో ఏ2 గా జగన్ ని చేర్చారు పోలీసులు. దీనిపై జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఓ సంచలన నివేదిక తెరపైకి వచ్చింది.

అవును... జగన్ పర్యటన సందర్భంగా వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జగన్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీ లను నిందితులుగా చేర్చారు. దీంతో.. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు కీలక విషయం వెల్లడించారు.

ఇందులో భాగంగా.. సింగయ్య మృతికి వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్‌ నిపుణులు స్పష్టం చేశారు! ఈ కేసుపై తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్‌ నివేదిక తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఘటన సమయంలో అక్కడ ఉన్న ప్రజలు, కార్యకర్తలు సెల్‌ ఫోన్లలో షూట్ చేసిన వీడియోలు అసలైనవేనని ఆ నివేదిక తేల్చి చెప్పింది!

కాగా... జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించిన కాన్వాయ్ లోని వాహనం కింద పడి సింగయ్య తీవ్రంగా గాయపడగా.. అతడిని ఆస్పత్రికి తరలించకుండా రోడ్డు పక్కకు లాగి వదిలేశారని చెబుతున్నారు. దీంతో... ఆయన కొంతసేపటికి ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో పోలీసులు పలు వీడియోలను పరిశీలించారు.

అయితే... తొలుత దేవినేని అవినాష్‌ అనుచరుడి వాహనం ఢీకొన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో.. వారు అదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు! అయితే... అనంతరం జగన్‌ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు వెలుగుచూడడం సంచలనమైంది. ఈ విషయాలను గుంటూరు జిల్లా ఎస్పీ స్పష్టంగా వెల్లడించారు.

ఆ సమయంలో... సింగయ్య మృతిపై వెలుగులోకి వచ్చినవి మార్ఫింగ్‌ వీడియోలంటూ వైసీపీ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు! దీంతో... ఘటనా స్థలంలో డ్రోన్, సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు అక్కడున్న వారు చిత్రీకరించిన వీడియోలను ఫోరెన్సిక్‌ విభాగానికి పంపించారు. ఈ నేపథ్యంలోనే... ఫోరెన్సిక్‌ నివేదిక కీలకంగా మారింది.

Tags:    

Similar News