ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తా.. భయపడొద్దు.. బ్రహ్మనాయుడి ఆభయం

పల్నాడులో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే అతికొద్ది మంది వైసీపీ నేతల్లో ఒకరు వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.

Update: 2023-12-23 04:28 GMT

పల్నాడులో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే అతికొద్ది మంది వైసీపీ నేతల్లో ఒకరు వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ముఖం పగిలేలా వ్యాఖ్యలు చేయటం.. చెప్పే విషయం ఏదైనా సరే.. కాసింత ఘాటుగా రియాక్టు కావటమే కాదు.. తన వాళ్లకు తరచూ అభయహస్తం అందిస్తుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదన్న సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థులపై ఫైర్ అయ్యారు.

'నేను వస్తున్నా అంటే అక్కడ ఎవరున్నా భయపడాల్సిందే. ఎక్కడైనా మీకు ఎవరితోనైనా ఇబ్బంది వస్తే నాకు ఫోన్ చేయండి. అన్న బ్రహ్మనాయుడు వస్తున్నాడని చెప్పండి. దీంతో ప్రత్యర్థులు భయపడాల్సిందే' అంటూ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీ నేతలతో పాటు.. సొంతపార్టీకి చెందిన తన వ్యతిరేక వర్గం నేతలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.

తనకు టికెట్ రాదని టీడీపీ నేతలు కలలు కంటున్నారని.. తమ పార్టీలోనూ కొందరు టికెట్లు వస్తుందని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ‘వాళ్ల బతుకుల చిట్టా విప్పుతా. నేను ఎవరికి భయపడను. తప్పు చేయలేదు.అందుకే నన్ను ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ ధీమాగా చెబుతున్న ఆయన మాటలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సొంత పార్టీలోనే బ్రహ్మనాయుడికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన తీరును పలువురు తప్పు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను తప్పనిసరిగా మార్చాలని లేకుంటే పార్టీకి ఇబ్బంది అంటున్నారు. ఇలాంటివేళ.. సొంత పార్టీలో తనను వ్యతిరేకించే వారిని.. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిని బెదిరించిన తరహాలో వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి.. వినుకొండ టికెట్ విషయంలో అధినేత ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News