రాజాసాబ్ : మళ్లీ లీక్.. మరోసారి వైరల్
ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన నుంచి రాబోతున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి;
ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన నుంచి రాబోతున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. సినిమాను 2025 సమ్మర్లోనే విడుదల చేయాలని భావించారు. ఏప్రిల్ నెలలోనే సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా సాధ్యం కాలేదు. షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు, వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కావడం వల్ల విడుదల వాయిదా వేశారు. బ్యాలన్స్ షూటింగ్ను త్వరలోనే పూర్తి చేసి, ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతోంది.
ఈ సినిమా నుంచి గతంలోనే ఒక ఫోటో లీక్ అయింది. తాజాగా మరో ఫోటో లీక్ అయింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రభాస్ మాస్ లుక్లో ఉన్న ఆ ఫోటోకు మంచి స్పందన వచ్చింది. ఆ ఫోటో క్వాలిటీ లేకున్నా సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా ఫ్యాన్ గ్రూప్స్ లో పంచుకుంటూ, ఫోటో గురించి చర్చించుకుంటున్నారు. రఫ్ లుక్లో ప్రభాస్ ను చూస్తూ ఉంటే భలే ఉంది అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రభాస్ను ఇలా చూసి చాలా కాలం అయింది అంటూ అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు. మిర్చి తరహా లుక్లో ప్రభాస్ను చూడటం చాలా సంతోషంగా ఉందని వారు అంటున్నారు.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఈ సినిమా ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా ఆలస్యం అవుతూ వస్తోందనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఈ సినిమాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి, అతి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను సైతం పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దసరా లేదా ఆ తర్వాత అయినా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంను ప్రభాస్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. హిందీ ఇండస్ట్రీలో కూడా థ్రిల్లర్ సినిమాలకు భారీ వసూళ్లు నమోదు అవుతున్న ఈ సమయంలో రాజాసాబ్ అదే జోనర్ కావడంతో అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రభాస్ తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి త్వరలోనే టీజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో విడుదల తేదీ విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.