వరద బాధితుల కోసం ఆ ఆంటీ ఛాలెంజ్

Update: 2015-11-30 17:30 GMT
సోనా ఆంటీ.. తమిళనాట ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులుండరు. వ్యాంప్ క్యారెక్టర్లు వేసే ఈ హాట్ బ్యూటీ.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేస్తుంటుంది. పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ చేస్తుంటుందని ఈమె మీద చాలా విమర్శలున్నాయి. ఆ మధ్య ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ తనమీద అత్యాచారం చేశాడని మీడియా ముందు గగ్గోలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. ఐతే ఇప్పుడామె ఓ మంచి పని కోసం మీడియా ముందుకొచ్చింది. చెన్నైలో వరద బాధితుల కోసం ఆమె రైస్ బకెట్ ఛాలెంజ్ మొదలుపెట్టింది.

వరద బాధితుల్ని ఆదుకునేందుకు బియ్యం సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఇలా సాయం చేసిన వాళ్లకు తనతో ఫొటో దిగే అవకాశం కూడా ఇస్తానంటోంది. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్సే వస్తోంది. ఇప్పటికే 400 కిలోల బియ్యం సమకూరాయట. తన టార్గెట్ 1500 కిలోల రైస్ అని అంటోంది సోనా. మరోవైపు తమిళ సినీ పరిశ్రమ అంతా వరద బాధితుల్ని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేస్తోంది. హీరో సూర్య రూ.25 లక్షల రూపాయలు సాయంగా అందించాడు. ఇటీవలే నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నాజర్, విశాల్, కార్తి తదితరులు కూడా పెద్ద పెద్ద ఎత్తున సాయం ప్రకటించారు. రెండు వారాల పాటు ముంచెత్తిన భారీ వర్షాలతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాలు దారుణంగా నష్టపోయాయి.
Tags:    

Similar News