తగ్గేదే లేదు.. పూరి మళ్ళీ రెడీ

Update: 2018-05-21 04:40 GMT
సినిమా హిట్.. ఫ్లాపులతో సంబంధం లేకుండా చకచకా సినిమాలు చేసుకుంటూ పోవడం డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పెషాలిటీ. తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టేందుకు ఆయనే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ మెహబూబా సినిమా తీశాడు. తన రొటీన్ స్టయిల్ లో కాకుండా ఇండియా - పాక్ వార్ బ్యాక్ డ్రాప్ గా మెహబూబా సినిమా రూపొందించాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

మెహబూబూ ఫ్లాప్ టాక్ నుంచి పూరి త్వరగానే బయటపడ్డాడు. తన తరవాత సినిమా కూడా కొడుకుతోనే తీస్తానని పూరి జగన్నాథ్ ముందే ప్రకటించాడు. అందుకు తగినట్టే తరవాత సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టేశాడట. తాజాగా మెహబూబా సినిమా ప్రమోషన్ కోసం పూరి - ఆయన టీం యూఎస్ వెళ్లారు. పనిలో పనిగా తరవాత సినిమా కోసం లోకేషన్ల వేట కూడా సాగించేస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఈసారి తీసే మూవీ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ గా తీయబోతున్నాడని తెలుస్తోంది.

మెహబూబాకు మౌత్ టాక్ బాగుందని.. నెమ్మదిగా పికప్ అవుతుందని పూరి మొదట్లో లెక్కేశాడు. కానీ అలా ఏమీ జరగలేదు. మెహబూబా చేదు అనుభవం నుంచి బయటకు రావాలంటే వీలైనంత త్వరగా నెక్స్ట్స్ సినిమా మొదలుపెట్టేయడమే మంచిదనే ఆలోచనలో పూరి ఉన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. పూరి జగన్నాథ్ తరవాత సినిమా కూడా తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ బ్యానర్ లోనే తీయబోతున్నాడు.
Tags:    

Similar News