వెనక్కి వెళ్లి బతుకుదాం.. ముందుకెళ్లి పీకేదేమీ లేదు: పూరీ

Update: 2021-05-15 11:35 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తన ఐడియాలజీని పోడ్ కాస్ట్ రూపంలో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు సందేశాత్మక అంశాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు పూరీ. ఈ క్రమంలో తాజాగా 'ఆఫ్‌ ది గ్రిడ్‌' గురించి మాట్లాడారు. భవిష్యత్తు ఎంతో దారుణంగా ఉండనుందని.. వైరస్ లకు దూరంగా హ్యాపీగా బ్రతకాలంటే తప్పకుండా ‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్‌’ ను ఫాలో అవ్వాలని పూరీ జగన్నాథ్‌ సూచించారు.

''ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్.. నాగరిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో నేచర్ లో ఎలాంటి ప్రజా వినియోగాలు లేకుండా బతకడం. ‘లివింగ్‌ ఆఫ్‌ ది గ్రిడ్‌’ అంటే వాటర్, టెలిఫోన్ కరెంటు, గ్యాస్‌, ఇంటర్నెట్‌.. ఇలాంటి మౌలిక వసతులు లేకుండా జీవించడం. అయితే గోయింగ్‌ ఆఫ్‌ ది గ్రిడ్‌ అనేది కొంతమంది మాత్రమే చేయగలరు. అలా చేయాలంటే సరైన ప్రదేశాన్ని చూసుకుని ముందు ఇల్లు కట్టుకోవాలి. సోలార్‌ లాంటి పవర్‌ సోర్సులు పెట్టుకోవాలి. కుదిరితే వర్షం నీటిని సైతం ఉపయోగించుకునేలా చూసుకోవాలి. దీన్ని ఫాలో అయ్యేవాళ్లు కమ్యూనికేషన్‌ కోసం శాటిలైట్‌ ఫోన్‌ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ల ఫుడ్ వాళ్లే పండించుకుంటారు.''

''పశువులు, కోళ్లను పెంచుకుంటారు. పశువుల పేడతో గోబర్‌ గ్యాస్‌ తయారు చేస్తారు. దాన్నే పంటలకు ఎరువుగా కూడా వాడతారు. అన్ని రకాల చెట్లు పెంచుకుంటారు. ధాన్యం, మొక్కజొన్న కూడా పండిస్తారు. వాళ్లకి కరెన్సీతో పనిలేదు. అప్పులు లేని జీవితం. జీవితాంతం ప్రతినెలా ఎవ్వరికీ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరూ వాళ్ల ఇంటి తలుపులు కొట్టరు. ఎలాంటి నోటీసులు వాళ్ల ఇంటికి రావు. ప్రపంచంలో 35 మిలియన్ల మంది ఇలా ఆఫ్‌ ది గ్రిడ్‌ బ్రతుకుతున్నారు''

''వీళ్ళు పర్యావరణం పట్ల ఎంతో బాధ్యతగా ఉండేవారిగా చెప్పొచ్చు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. మన రూట్స్ లోకి వెళ్లి బ్రతుకుతారు. పూర్వీకులు ఇలాగే ఎన్నో వేల సంవత్సరాలు బతికారు. అప్పట్లో అందరిదీ ఆఫ్‌ గ్రిడ్‌ లివింగే కాబట్టే మన ప్లానెట్ ఎంతో పచ్చగా ఉండేది. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి. నేచర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 100 డైనోసర్లు అడవిలో పుట్టి అదే అడవిలో చనిపోతే ఈ నేచర్ కు గుర్తు ఉండదు. కానీ నలుగురు మానవులు బతికి చనిపోయిన తర్వాత చూస్తే అడవి సగం నరికేసి ఉంటుంది. అందుకే ప్రకృతి మనల్ని గుర్తు పెట్టుకుంటుంది. ఎప్పుడో మానవజాతిని అండర్ లైన్ చేసుకొని పెట్టుకొని ఉంది''

''మనకి ప్రకృతిలో బతకడం రాదు. ఆఫ్‌ గ్రీడ్‌ పీపుల్ పర్యావరణానికి చాలా అవసరం. మనందరం లైఫ్ లో ఇలాంటి ఆఫ్‌ గ్రిడ్‌ ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వైరస్‌ ల నుంచి దూరంగా హ్యాపీగా బతకాలంటే ఇలాంటిది మనకి కావాలి. పట్టణాలకు దూరంగా ఇలాంటి ఒక ఇంటిని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ ఇంకా దారుణంగా ఉండబోతోంది. మీ పిల్లలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే అది ఇదే. దగ్గరలో హాస్పిటల్ లేకపోతే ఎలా అని భయపడొద్దు. అక్కడ రోజూ పనిచేసుకుంటూ బతికితే మీకు ఎలాంటి జబ్బులు ఉండవు. పోతే వృద్ధాప్యంతోనే పోతారు. నీటిలో చేపల్లాగా, గాలిలో పక్షుల్లాగా, అడవిలో జంతువుల్లాగా.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్రీగా హాయిగా బతికే మార్గం ఆఫ్‌ ది గ్రిడ్‌. వెనక్కెళ్లి బతుకుదాం. ముందుకెళ్లి పీకేది ఏమీ లేదు'' అని పూరీ జగన్నాథ్ ఆఫ్‌ ది గ్రిడ్‌ గురించి వివరించారు.
Full View
Tags:    

Similar News