కృష్ణవంశీ ఆ హీరోను మెప్పించలేకపోయాడా?

Update: 2018-03-21 14:11 GMT
ప్రస్తుత ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. గులాబి.. నిన్నే పెళ్లాడతా.. సింధూరం.. ఖడ్గం.. మురారి లాంటి సినిమాలతో తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారాయన. కానీ చాలామంది అగ్ర దర్శకుల్లాగే ఆయన కూడా ఒక దశ దాటాక ఔట్ డేట్ అయిపోయారు. మారుతున్న ట్రెండుకు తగ్గట్లుగా సినిమాలు చేయలేకపోయారు. గత దశాబ్ద కాలంలో వంశీ నుంచి చెప్పుకోదగ్గ మెరుపులేమీ లేవు. చివరగా ఆయన తీసిన ‘నక్షత్రం’ తన కెరీర్లోనే అన్ని రకాలుగా అత్యంత పేలవమైన సినిమా అయింది.

‘నక్షత్రం’ చూశాక కృష్ణవంశీ అభిమానులు సైతం ఇక ఆయన సినిమాలు ఆపేస్తే బెటర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఐతే వంశీ మాత్రం తన ప్రయాణాన్ని ఇప్పుడే ఆపేయాలనుకోవట్లేదు. మళ్లీ పుంజుకోవాలని.. ఒక సినిమాతో తానేంటో చాటి చెప్పాలని పట్టుదల ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక వైవిధ్యమైన కథ రెడీ చేసుకుని రానా దగ్గుబాటిని కలిసినట్లు సమాచారం. ఐతే ఈ కథ రానాను సంతృప్తిపరచలేకపోయిందట. కథ నచ్చితే వంశీ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా సినిమా చేద్దామని భావించాడట రానా. కానీ వంశీ అతడిని ఇంప్రెస్ చేయలేకపోయినట్లు సమాచారం. మర్యాదపూర్వకంగానే వంశీకి విషయం చేరవేయగా.. ఆయన ఇప్పుడు మరో హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడట.
Tags:    

Similar News