తారకరత్న కోసం కదిలిన ఎన్టీఆర్.. ఫొటో వైరల్

Update: 2023-01-29 11:29 GMT
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు అంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండె పోటు వచ్చిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికే తారక్ రత్న ఆరోగ్యంపై ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆరా తీశారు. బాబాయ్ బాలకృష్ణ కు ఫోన్ చేసి నిన్న వివరాలు తెలుసుకున్నారు. తాజాగా కల్యాణ్ రామ్, ఎన్టీ ఆర్ కుటుంబం తో సహా బెంగళూరు చేరుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి.  ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మరింత ఎక్కువ అవుతోంది. తారక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఆస్పత్రిలోనే ఉన్నారు.

నటసింహం బాలకృష్ణ... తారక్ ఆరోగ్యంపై చాలా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన నిన్నటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు. తారక్ పరిస్థితి విషమించడంతో బాలయ్య చాలా డీల పడిపోయినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీడియాలో వస్తున్నాయి. దీన్ని చూసిన బాలయ్య అభిమానులు కూడా ఎంతో బాధపడుతున్నారు. బాలయ్యను ఎప్పుడు ఇలా చూడలేదని చెబుతున్నారు. ధైర్యంగా ఉండాలని అంటున్నారు.

ఇక తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస కొనసాగుతోందని వైద్యులు స్పష్టం చేశారు. తారకరత్నకు ఐసీయూలో ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News