పర్ఫెక్షన్ కోసం స్టార్ సింగర్ కే అగ్నిపరీక్ష!
ఇప్పటికే విడుదలైన ప్రచారలు అంతకంతకు హైప్ పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్- సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం `రామాయణ` పై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే విడుదలైన ప్రచారలు అంతకంతకు హైప్ పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమాలో భక్తిరసంతో నిండిన `జై జై రామ్` అనే ప్రత్యేక గీతం శ్రోతలను అలరించడానికి సిద్ధమవుతుండగా.. ఈ పాట రికార్డింగ్ వెనుక ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. చిత్రంలో జై జై రామ్ సాంగ్ను బాలీవుడ్ స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ ఆలపించారు. అయితే ఈ పాటలో పరిపూర్ణత సాధించడం కోసం, అందులోని ఆధ్యాత్మిక భావాన్ని సంపూర్ణంగా పండించడం కోసం అరిజిత్ సింగ్ ఏకంగా 200 టేక్స్ తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఒక పాట కోసం గాయకుడు ఇంత సుదీర్ఘ సమయం కేటాయించి శ్రమించడం ఇండస్ట్రీలో అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు. అరిజిత్ సింగ్ కేవలం సాంకేతిక సరిహద్దుల కోసం మాత్రమే కాకుండా శ్రీరాముడి భక్తిభావంలో పూర్తిగా లీనమైపోయి ఈ పాటను పాడారని తెలుస్తోంది. ప్రతి పదాన్ని, స్వరాన్ని దైవికమైన భావోద్వేగంతో పలకాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి టేక్ను అత్యంత శ్రద్ధతో ఆలపించారు. ఈ క్రమంలో ప్రతి చిన్న సూక్ష్మాంశాన్ని సరిచూసుకుంటూ అత్యుత్తమ అవుట్పుట్ను అందించినట్లు తెలుస్తోంది.
ఈ మహా కావ్యం నేపథ్యానికి తగినట్లుగా అద్భుతమైన సంగీతాన్ని అందించేందుకు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ వంటి దిగ్గజాలు పని చేసారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్లో సంగీతం ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో? గుర్తించిన అరిజిత్ సింగ్, దర్శకుడి విజన్కు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు తన శక్తినంతా ధారపోశారు.
ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలోనూ, సాయి పల్లవి సీతాదేవి పాత్రలోనూ కనిపిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ను వెండితెరపై చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు అరిజిత్ సింగ్ పూనకంతో పాడిన జై జై రామ్ భక్తి గీతం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, అందరి హృదయాలను హత్తుకుంటుందని భావిస్తున్నారు. అర్జిత్ సింగ్ చూపించిన అంకితభావం, కష్టం చూస్తుంటే జై జై రామ్ పాట చారిత్రాత్మక విజయాన్ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భక్తిరస గానాన్ని వెండితెరపై ఆస్వాదించేందుకు అభిమానులు, సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.