వంగ.. ‘యానిమల్ పార్క్’ అప్డేట్ ఇచ్చేశాడు
‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత బాలీవుడ్లో అంతకుమించి ప్రకంపనలు రేపాడు.;
‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత బాలీవుడ్లో అంతకుమించి ప్రకంపనలు రేపాడు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అతను.. ఆపై కొత్త కథతో ‘యానిమల్’ తీసి బాక్సాఫీస్ను షేక్ చేశాడు. రణబీర్ కపూర్ను సూపర్ స్టార్ను చేసిన చిత్రమిది. ఏకంగా రూ.900 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా చివర్లో దీని సీక్వెల్ ‘యానిమల్ పార్క్’కు లీడ్ ఇవ్వడంతో ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఐతే ‘యానిమల్’ తర్వాత సందీప్, రణబీర్ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. ‘యానిమల్ పార్క్’ ఎప్పుడు ఉంటుంది.. అసలుంటుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా సందీప్ రెడ్డి ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. ‘యానిమల్’ సినిమా జపాన్లో రిలీజవుతున్న నేపథ్యంలో హీరో రణబీర్తో కలిసి ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లాడు సందీప్.
ఈ సందర్భంగా ‘యానిమల్ పార్క్’ గురించి మాట్లాడాడు. యానిమల్కు కొనసాగింగా తెరకెక్కే ఈ చిత్రానికి 2027లో షూటింగ్ మొదలుపెడతామని.. 2028లో రిలీజ్ చేస్తామని సందీప్ తెలిపాడు. ప్రస్తుతం తాను ‘స్పిరిట్’ షూటింగ్లో బిజీగా ఉన్నానని.. అది రిలీజ్ కాగానే ‘యానిమల్ పార్క్’ పని మీదే ఉంటానని సందీప్ చెప్పాడు. ఇంతకుముందు అన్నట్లే ‘యామినల్’ కంటే ‘యానిమల్ పార్క్’ ఇంకా బోల్డ్గా, వైల్డ్గా ఉంటుందని సందీప్ స్పష్టం చేశాడు. ‘యానిమల్’ చివర్లో ఇచ్చిన లీడ్తోనే సీక్వెల్ ఇంకా వైల్డ్గా ఉండబోతోందని అర్థమైంది. హీరో రూపంలోనే ఉండే విలన్ పాత్ర మీద పెట్టిన చిన్న సీన్ గగుర్పొడిచేలా తీర్చిదిద్దాడు సందీప్. ‘యానిమల్ పార్క్’లో ఇటు హీరోగా, అటు విలన్గా రణబీర్ విశ్వరూపాన్ని చూడొచ్చని సంకేతాలు అందాయి. ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో.