Begin typing your search above and press return to search.

అమరావతికి బ్రేక్.. జగన్ కు షాక్

By:  Tupaki Desk   |   10 July 2019 7:45 AM GMT
అమరావతికి బ్రేక్.. జగన్ కు షాక్
X
ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన నూతన రాజధానికి నిధులు కావాలంటే తనిఖీలు చేయాల్సిందేనని తాజాగా రుణమిచ్చిన ప్రపంచబ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి తేల్చిచెప్పడం షాక్ లా మారింది.

తాజాగా ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్ నుంచి సమాచారం అందింది. ఏపీ రాజధాని నిర్మాణానికి బ్యాంక్ తనిఖీల ప్యానెల్ వచ్చి తనిఖీలు చేస్తుందని.. ఈ విషయమై అభిప్రాయం చెప్పాలని 23వ తేదీలోగా సమయం ఇస్తూ ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్ లేఖ రాసింది.

అమరావతి నిర్మాణం కోసం రూ 7200 కోట్ల రుణాన్ని సీఆర్డీఏ కు ఇవ్వాలని ప్రపంచబ్యాంకును ఏపీ సర్కారు కోరింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. అయితే రాజధానికి చెందిన కొందరు ప్రపంచ బ్యాంక్ కు 2017 మే 25న ఫిర్యాదు చేశారు. తమ ప్రయోజనాలకు అమరావతి విఘాతం కలిగిస్తోందని రుణాలు ఇవ్వవద్దని కోరారు. ఈ సమయంలోనే ప్రపంచబ్యాంక్ తనిఖీలకు సిద్ధమైంది.

చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న ఈ అభ్యంతరం ఇన్నాళ్లు ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా ఉంది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రపంచబ్యాంక్ మోకాలడ్డడం సంచలనంగా మారింది. జగన్ వస్తే రాజధాని నిర్మాణం ఆగిపోతుందన్న ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరేలా ప్రపంచబ్యాంక్ వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.