Begin typing your search above and press return to search.

‘ధర్మవరం’లో ఫ్లెక్సీ రచ్చ.. ఇది చాలా పీక్స్ గురు!

ఈ ఫ్లెక్సీలో టీడీపీ అధినేత చంద్రబాబు.. నారా లోకేశ్.. ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఫోటోలు ముద్రించారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 4:43 AM GMT
‘ధర్మవరం’లో ఫ్లెక్సీ రచ్చ.. ఇది చాలా పీక్స్ గురు!
X

కొత్త సంవత్సరాన్నిపురస్కరించుకొని ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెను వివాదానికి కారణంగా మారటమే కాదు.. రాజకీయ రచ్చకు కారణమైంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఈ వైనం పరిటాల వర్సెస్ గోనుగుంట్లగా మారింది. ముదిగుబ్బ మండల కేంద్రంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీలో టీడీపీ అధినేత చంద్రబాబు.. నారా లోకేశ్.. ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఫోటోలు ముద్రించారు. దీనికి ధర్మవరం లోక్ సభ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్లెక్సీలో తమ నాయకుల ఫోటోలు ఎందుకు వేశారు? అంటూ ప్రశ్నించారు. దీనికి కారణం.. గోనుగుంట్ల సూర్య నారాయణ బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఉన్నప్పుడు మోడీ.. అమిత్ షా ఇతర నాయకుల ఫోటోలు వేసుకోవాలే కానీ చంద్రబాబు.. లోకేశ్ ఫోటోలు ఎందుకు ప్రింట్ చేయించి.. ఫ్లెక్సీ ఏర్పాటు చేశారేం? అని ప్రశ్నించారు

దీంతో.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎంటర్ అయిన పోలీసులు ఇరు వర్గాల మధ్య నచ్చజెప్పి వివాదం సమిసేలా చేశారు. అయినప్పటికీ.. ఇరువర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2014లో టీడీపీ తరఫున ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.2019లోనూ మళ్లీ పోటీ చేసి ఓడారు. అనంతరం బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీలో ఉన్న ఆయన.. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. టీడీపీ అగ్రనాయకత్వం ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటాన్ని పరిటాల వర్గీయులు తీవ్రంగా తప్పు పడుతున్నారు.