Begin typing your search above and press return to search.

'కెప్టెన్'.. శుబ్ మన్ గిల్. . ఒకే ఒక్క చాన్స్ అంటున్న అతడి కెప్టెన్

ఇక షా.. మాత్రం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదాపడి తిరిగి ప్రారంభం కానున్న ఐపీఎల్ మీద ఆశలు పెట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   16 May 2025 5:00 AM IST
కెప్టెన్.. శుబ్ మన్ గిల్. . ఒకే ఒక్క చాన్స్ అంటున్న అతడి కెప్టెన్
X

కాలం కలిసిరాలేదనో, క్రమశిక్షణ లేదనో, నిర్ణయాలు సరిగా తీసుకోకనో, పరిస్థితుల ప్రభావంతోనే కొన్నిసార్లు మనుషుకు బ్యాడ్ టైమ్ నడుస్తుంటుంది. ఎంతో భవిష్యత్ ఉందని ఊహించుకుంటే అంతా అంధకారం అయిపోతుంది.

యువ క్రికెటర్ పృథ్వీ షా సంగతే చూసుకుంటే పైన చెప్పినదంతా వాస్తవమే అనిపిస్తుంది. ఇప్పటి వైభవ్ సూర్యవంశీని మించి పదేళ్ల కిందటనే పృథ్వీ షా గొప్ప పేరు తెచ్చకున్నాడు. రంజీల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ, దేశవాళీ వన్డే మ్యాచ్, దులీప్ ట్రోఫీ ఇలా ప్రతి టోర్నీ తొలి మ్యాచ్ లోనూ సెంచరీ కొట్టేశాడు. ఆఖరికి టీమ్ ఇండియా తరఫున 2018లో వెస్టిండీస్ పైనా తొలి టెస్టులోనే సెంచరీ బాదేశాడు.

దీనికిముందే 2018లో అండర్-19 జట్టు కెప్టెన్ గా దేశానికి ప్రపంచకప్ కూడా సాధించి పెట్టాడు. ఆ టోర్నీలో అందరూ షా గురించే చెప్పుకొన్నారు. కానీ, అతడికి డిప్యూటీగా వ్యవహరించిన శుబ్ మన్ గిల్ ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా?

2018లో టీమ్ ఇండియాలోకి వచ్చిన షా.. ఆ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా టూర్ లో గాయపడ్డాడు. అంతే, అప్పటినుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. మళ్లీ జట్టులోకి వచ్చినా ప్లేస్ నిలుపుకోలేక పోయాడు. తర్వాత క్రమశిక్షణ లోపం, ఫామ్, ఫిట్ నెస్ కోల్పోవడం వంటి కారణాలతో శాశ్వతంగా దూరమయ్యాడు. మధ్యలో గాయాలూ అతడిని దెబ్బతీశాయి. ఆఖరికి ఐపీఎల్ లో అన్ సోల్డ్ గా మిగిలాడు చిన్న వయసులోనే రూ.50 కోట్ల డబ్బు రావడమే షాను చెడగొట్టిందనే అభిప్రాయం కూడా వినిపించింది.

2020లో టీమ్ ఇండియాలోకి వచ్చిన గిల్ వెనక్కుతిరిగి చూసుకునే అవసరం లేనంతగా ఎదిగాడు. ఇప్పుడు అతడు టెస్టు జట్టు కెప్టెన్ కాబోతున్నాడు. గత ఏడాదే గిల్ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ కెప్టెన్ టైటాన్స్ బాధ్యతలు కూడా చేపట్టాడు. ఈ సీజన్ లో చాంపియన్ గా నిలిపేలా ఉన్నాడు.

ఇక షా.. మాత్రం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదాపడి తిరిగి ప్రారంభం కానున్న ఐపీఎల్ మీద ఆశలు పెట్టుకున్నాడు.

యుద్ధం కారణంగా వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు తిరిగి రాని పరిస్థితుల్లో వారి స్థానాల్లో రీప్లేస్ మెంట్లకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. ఈ ఏడాది చివరలో జరిగే మినీ వేలంలోకి లెక్కలోకి రాదు. కాగా, రీప్లేస్ మెంట్లలో తన పేరూ పరిశీలించండి అంటూ ‘‘నాకు ఒక బ్రేక్ కావాలి’’ అని షా పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ’అయ్యో షా’ అని నిట్టూరుస్తున్నారు.

షా ముంబైకి చెందినవాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు. విదేశీ ఆటగాళ్లు తిరిగి రాకుంటే అతడిని ఈ రెండు ఫ్రాంచైజీల్లో ఏదో ఒకటి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

ఇదీ.. శుబ్ మన్ గిల్ కు ఒకప్పటి కెప్టెన్ అయిన పృథ్వీ షా ప్రస్తుత పరిస్థితి.