అందగత్తెలు పక్కన పెడితే .. ’ఆటగాళ్లొస్తున్నారు’.. ఐపీఎల్ జట్లకు బిగ్ రిలీఫ్
సరిగ్గా వారం కిందటి వరకు క్రికెట్ అభిమానుల సందడి మామూలుగా లేదు... కానీ, ఆ ఉత్సాహం అంతలోనే చల్లారిపోయింది. కారణం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అర్థంతరంగా ఆగిపోవడం.
By: Tupaki Desk | 15 May 2025 1:52 PM ISTసరిగ్గా వారం కిందటి వరకు క్రికెట్ అభిమానుల సందడి మామూలుగా లేదు... కానీ, ఆ ఉత్సాహం అంతలోనే చల్లారిపోయింది. కారణం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అర్థంతరంగా ఆగిపోవడం. తమ నగరాల, రాష్ట్రాల పేరిట ఉన్న జట్లను తలచుకుని తామే ఆడుతున్నంతగా ఫీల్ అయ్యారు. అయితే, పెహల్గాం దారుణంతో పాకిస్థాన్ పై భారత్ యుద్ధానికి దిగడంతో పరిస్థితులు మారిపోయాయి.
ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే ఆపివేశారు. అయితే, ఈ మ్యాచ్ సహా శనివారం నుంచి లీగ్ మొదలుకానుంది. మధ్యలో పది రోజులు గ్యాప్ రావడంతో విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి? అసలు వారు భారత్ లోనే ఉన్నారా? అనే ప్రశ్నలు వచ్చాయి.
మరోవైపు భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యం, తమ భవిష్యత్ టూర్ల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్ల కొందరు తమ దేశాలకు వెళిపోయారు. ఇలాంటివారిలో డబ్ల్యూటీసీ (ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్) ఫైనల్ ఆడనున్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లే అధికం.
ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్నందున తమ ఆటగాళ్లను తిరిగి ఇండియాకు పంపేది లేదని దక్షిణాఫ్రికా తేల్చిచెప్పింది. తాజాగా ఆ దేశ బోర్డు నిర్ణయం మార్చుకుంది. డబ్ల్యూటీసీనే తమకు ముఖ్యమని, మే 26 వరకే తమ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని తొలుత ప్రకటించిన దక్షిణాఫ్రికా.. మళ్లీ ఇప్పుడు మనసు మార్చుకుంది.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు శనివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే ఐపీఎల్ కు అందుబాటులో ఉండనున్నారు. దీనికోసం డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్ టైమ్ కూడా తగ్గించుకుంది.
గుజరాత్ కే బిగ్ రిలీఫ్
ఈ సీజన్ లో ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ టాప్ లో దూసుకెళ్తోంది. ఆ జట్టులోని పేసర్ కగిసో రబాడ (దక్షిణాఫ్రికా), బ్యాట్స్ మన్ జాస్ బట్లర్ (ఇంగ్లండ్) వంటివారు మళ్లీ అందుబాటులోకి రానున్నారు.
ఇక మరో టాప్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు లుంగి ఎంగిడి (దక్షిణాఫ్రికా) సేవలు అందుబాటులో ఉండనున్నాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), మార్ క్రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), వికెట్ కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్), మార్కో యాన్సన్ (పంజాబ్ కింగ్స్), వియాన్ ముల్డర్ (సన్ రైజర్స్ హైదరాబాద్) ఐపీఎల్ జట్లకు లీగ్ ముగిసేవరకు ఆడనున్నారు.
ఇక పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్ లను డిస్క్ జాకీ
(డీజే)లు, చీర్ లీడర్స్ లేకుండానే నిర్వహించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఇప్పటికే బీసీసీఐని కోరాడు. పెహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. దీనిపై బీసీసీఐ.. లీగ్ లోని మిగతా మ్యాచ్ లను హంగూఆర్భాటాలకు దూరంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే.. అందగత్తెలు (చీర్ లీడర్స్) లేకుండా ఆటగాళ్లతోనే అన్నమాట.