టీమ్ ఇండియా మరో మేటి క్రికెటర్ రిటైర్? అతడు షమీనేనా?
సరిగ్గా ఐదు నెలలు.. టీమ్ ఇండియాకు చెందిన ముగ్గురు మేటి క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. అసలు వీరిలో ఎవరూ ఇంత తొందరగా రిటైర్ అవుతారని ఊహించలేదు..
By: Tupaki Desk | 16 May 2025 8:00 PM ISTసరిగ్గా ఐదు నెలలు.. టీమ్ ఇండియాకు చెందిన ముగ్గురు మేటి క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. అసలు వీరిలో ఎవరూ ఇంత తొందరగా రిటైర్ అవుతారని ఊహించలేదు..
తొలుత ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ జోరుగుతుండగానే సీనియర్ ఆఫ్ స్పిన్నర్, 500 వికెట్లకు పైగా తీసిన రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వీడ్కోలు పలికాడు. వాస్తవానికి ఆ సిరీస్ లో ఒక టెస్టు ఆడాడు అశ్విన్. మరో మ్యాచ్ లోనూ అవకాశం దక్కేదేమో? ఇంతలోనే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. సిరీస్ జరుగుతుండగానే ఇండియాకు వచ్చేశాడు.
ఇక సరిగ్గా నెల రోజుల్లో ఇంగ్లండ్ టూర్ ఉందనగా.. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ కు అతడే కెప్టెన్ అని భావిస్తుండగా సీనియర్ స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇది జరిగిన వారం రోజుల్లోపే స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా వీడ్కోలు చెప్పేశాడు. తాను ఎంతో ఇష్టపడే టెస్టులకు బైబై అన్నాడు. వాస్తవానికి కోహ్లి ఫిట్ నెస్ రీత్యా మరో రెండేళ్లయినా టెస్టులు ఆడే సత్తా ఉన్నవాడు. పైగా అతడు ప్రస్తుతం ఐపీఎల్ లో ఫామ్ చాటుతున్నాడు కూడా. రోహిత్ లేనందున టీమ్ ఇండియాకు ఇంగ్లండ్ లో బ్యాటింగ్ లో కోహ్లినే పెద్ద దిక్కు అయ్యేవాడు. కానీ, అవేమీ ఆలోచించలేదు. తన నిర్ణయం చెప్పేశాడు.
కోహ్లి ఇలా వెళ్లిపోయాడో లేదో..? అలా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ రిటైర్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. తరచూ గాయపడుతున్న షమీ.. ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఆడుతున్నాడు. ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. తనలో మునుపటి పదును తగ్గింది. అందుకనే షమీ రిటైర్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, వీటిని సీనియర్ పేసర్ తీవ్రంగా ఖండించాడు. ఇలాంటివాటిని వ్యాపింపజేయొద్దంటూ హెచ్చరించాడు.
ఇక షమీ దుమారం చల్లారింది అనుకుంటుండగా.. తాజాగా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ అవుతున్నట్లు ఫీలర్లు వస్తున్నాయి. ఈ మేరకు జడేజా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను ఉదాహరణగా చూపుతున్నారు. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటోను చూసి అభిమానులు జడేజా రిటైర్ అవుతున్నట్లు అంచనా కు వచ్చారు. గురువారం నాడు జడేజా టీమ్ ఇండియా టెస్టు జెర్సీతో ఉన్న ఫొటోను ఇన్ స్టాలో పంచుకున్నాడు. దీనినే అభిమానులు వేరేలా అర్థం చేసుకున్నారు. ఇంకేముంది? టెస్టుల నుంచి వైదొలుగుతున్నందుకే జడేజా ఈ ఫొటో పెట్టాడంటూ విశ్లేషణలకు దిగారు.
సీనియర్ ఆల్ రౌండర్ అయిన జడేజా 2009 నుంచి టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. రోహిత్, కోహ్లిల సమకాలికుడు. మధ్యలో జట్టుకు దూరమైనా.. తిరిగొచ్చాక అద్భుతంగా రాణించాడు. రోహిత్, కోహ్లితో పాటే గత ఏడాది అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ఇచ్చాడు. మరి టెస్టుల సంగతి ఏమిటో?