రాజరికం చూపించొద్దు.. ‘రాజవంశం’ మహిళకు సుప్రీం హితవు
దీంతో ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ వీరి ఇష్యూ ఏమిటి? అసలేం జరిగింది? ఆ జంట ఎవరు? వారి మధ్య ఉన్న పంచాయితీ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..
By: Tupaki Desk | 16 May 2025 10:43 AM ISTఇప్పుడున్న కాలంలో భార్యభర్తల మధ్య పంచాయితీలు కామన్ గా మారిపోవటం తెలిసిందే. విభేదాలతో కోర్టుల్ని ఆశ్రయించే జంటలకు కాస్త భిన్నమైందీ ఉదంతం. రాజకుటుంబానికి చెందిన ఒక మహిళ.. తన భర్తతో నెలకొన్న ఆర్థిక అంశాలపై కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం సూచనపై సదరు మహిళ స్పందించిన తీరుపై సుప్రీం కోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. రాజరికాన్ని చూపించొద్దంటూ హితవు పలికింది. మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకుంటే కఠిన నిర్ణయాన్ని వెలువరించాల్సి వస్తుందంటూ స్పష్టం చేసింది. దీంతో ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ వీరి ఇష్యూ ఏమిటి? అసలేం జరిగింది? ఆ జంట ఎవరు? వారి మధ్య ఉన్న పంచాయితీ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..
గ్వాలియర్ లో నివసిస్తున్న ఒక మహిళ తాను ఛత్రపతి శివాజీ మహారాజ్ నౌకాదళానికి అధిపతి.. కొంకణ్ ప్రాంత పాలకుడి వంశానికి చెందిన వ్యక్తిగా పేర్కొంటారు. ఆమె భర్త సైనికాధికారుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. మధ్యప్రదేశ్ లో విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. భార్య.. భర్తల మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయి. దీంతో.. వారు కోర్టును ఆశ్రయించారు.
ఈ ఇష్యూను పరిష్కరించేందుకు మధ్యవర్తిగా సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ ను నియమించింది న్యాయస్థానం. తన భర్త.. వారి కుటుంబం వరకట్నంగా రోల్స్ రాయిస్ కారు.. ముంబయిలో ప్లాట్ డిమాండ్ చేస్తున్నట్లుగా సదరు మహిళ పేర్కొన్నారు. అయితే.. ఆమె వాదనను భర్త విభేదిస్తున్నారు. దీంతో వీరి మధ్య నెలకొన్న సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వం ఎలాంటి ఫలితాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో సదరు మహిళ మధ్యవర్తిత్వం విఫలమైందని వ్యాఖ్యానిస్తున్నారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. మధ్యవర్తిత్వం విఫలమైందంటూ ఏ రకంగా ప్రకటనలు చేస్తున్నారు? మహరాజులా వ్యవహరించొద్దని.. 75 ఏళ్ల ప్రజాస్వామ్యం గడిచిందన్న విషయాన్ని పేర్కొంటూ.. ‘మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం సాధించలేకపోతే మూడు రోజుల్లో కఠిన ఆదేశాల్ని జారీ చేస్తాం’ అని పేర్కొన్నారు. వీరి కేసు తదుపరి వారానికి వాయిదా వేశారు. ఈ కేసులో సుప్రీం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.