అర్హత ఉంటే అమ్మాయిలైనా సరే అవకాశం ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు
భారత సైన్యంలోని న్యాయ విభాగమైన జడ్జి అడ్వొకేట్ జనరల్ (JAG) బ్రాంచీలో మహిళా అధికారుల సంఖ్య తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.
By: Tupaki Desk | 14 May 2025 4:49 PM ISTభారత సైన్యంలోని న్యాయ విభాగమైన జడ్జి అడ్వొకేట్ జనరల్ (JAG) బ్రాంచీలో మహిళా అధికారుల సంఖ్య తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆ పోస్టులకు ఆడ-మగ తేడా చూడాల్సిన పని లేదని రూల్ ఉన్నా, కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీసింది. అబ్బాయిలతో పోటీ పడి రఫేల్ లాంటి ఫైటర్ జెట్లను అమ్మాయిలు నడుపుతుంటే.. ఆర్మీలోని లీగల్ పోస్టులు ఇవ్వడానికి ఎందుకంత మొహమాటమని అత్యున్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది.
అసలు విషయం ఏంటంటే.. సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే ఇద్దరు అమ్మాయిలు టాప్ ర్యాంకులు సాధించారు. అష్నూర్ కౌర్ 4వ ర్యాంకు, ఆస్థ త్యాగీ 5వ ర్యాంకు తెచ్చుకున్నారు. కానీ వాళ్లను ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు తమకు జరిగిన అన్యాయం గురించి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అబ్బాయిల కంటే ఎక్కువ మెరిట్ ఉన్నా, అమ్మాయిల కోటాలో ఖాళీలు లేవని చెప్పి తమను సెలెక్ట్ చేయలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్పై రీసెంట్గా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
కోర్టు ఏమందంటే.. "భారత వాయుసేనలో అమ్మాయిలకు రఫేల్ యుద్ధ విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చినప్పుడు.. ఆర్మీలోని లీగల్ బ్రాంచీల్లో అబ్బాయిల కంటే ఎక్కువ మంది అమ్మాయిలను తీసుకోవడంలో ఏంటి కష్టం? ఆడ-మగ తేడా లేకుండా ఆ పోస్టులు తటస్థమైనవని కేంద్రమే చెబుతున్నప్పుడు.. అమ్మాయిలకు ఎందుకు ఎక్కువ పోస్టులు ఇవ్వకూడదు? స్త్రీ-పురుష సమానత్వం అంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు సేమ్ అవకాశాలు ఇవ్వడం మాత్రమే కాదు. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే వాళ్లకు అవకాశం ఇవ్వడమే నిజమైన సమానత్వం" అని ధర్మాసనం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఆ తర్వాత ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై త్వరలోనే తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
ఈ కేసులో పిటిషనర్లు తమకు పురుష అభ్యర్థుల కంటే ఎక్కువ మెరిట్ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ, కేవలం మహిళా కోటాలో ఖాళీలు లేవనే సాకుతో తమను ఎంపిక చేయకపోవడం అన్యాయమని వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ పోస్టులకు లింగ నిష్పత్తి వర్తించదని చెబుతోంది. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం, మరోవైపు ఇలాంటి వివక్ష చూపడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. రఫేల్ వంటి అధునాతన యుద్ధ విమానాలను నడిపే సత్తా ఉన్న మహిళలు, న్యాయపరమైన బాధ్యతలు నిర్వర్తించడంలో ఎందుకు వెనుకడుగు వేస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసు తీర్పు మహిళా అధికారుల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ కోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇస్తే, భవిష్యత్తులో సైన్యంలోని ఇతర విభాగాల్లో కూడా మహిళలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది.