Begin typing your search above and press return to search.

పోలీసులకు చురకలు.. టాయిలెట్లలో నేరస్తులే పడుతున్నారా? హైకోర్టు ప్రశ్న!

పోలీస్ స్టేషన్లలో ఖైదీల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తరచూ విమర్శలు వస్తుంటాయి.

By:  Tupaki Desk   |   16 May 2025 5:02 PM IST
పోలీసులకు చురకలు.. టాయిలెట్లలో నేరస్తులే పడుతున్నారా? హైకోర్టు ప్రశ్న!
X

పోలీస్ స్టేషన్లలో ఖైదీల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తరచూ విమర్శలు వస్తుంటాయి. తాజాగా మద్రాస్ హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పోలీసుల పనితీరును మరోసారి ప్రశ్నార్థకం చేశాయి. పోలీస్ స్టేషన్లలోని టాయిలెట్లలో కేవలం నేరస్తులు మాత్రమే పడిపోతున్నారా? ఆ టాయిలెట్లను పోలీసులు ఉపయోగించడం లేదా? వారికి ఎందుకు గాయాలు కావడం లేదు? అంటూ హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

కాంచీపురానికి చెందిన జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి ఒక కేసులో అరెస్టయి జైలులో ఉన్నాడు. అతని చేతులు, కాళ్లు విరిగాయని అతనికి సరైన చికిత్స అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అతని తండ్రి ఇబ్రహీం మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జీఆర్ స్వామినాథన్, లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం అరెస్టయిన వ్యక్తి ఎలా గాయపడ్డాడని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ, టాయిలెట్‌లో జారిపడటం వల్ల గాయాలు అయ్యాయని తెలిపారు. అయితే, ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "పోలీస్ స్టేషన్లలోని టాయిలెట్లు కేవలం నేరస్తులు మాత్రమే పడి గాయాలు చేసుకునేలా ఉన్నాయా? ఆ టాయిలెట్లను ఇన్స్పెక్టర్లు ఉపయోగించడం లేదా? వారికి ఎందుకు ఎలాంటి గాయాలు కావడం లేదు?" అంటూ సూటిగా ప్రశ్నించింది.

ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని పోలీసులకు సూచించిన ధర్మాసనం, సంబంధిత పోలీసు అధికారులను విధుల నుండి తొలగించే పరిస్థితి కూడా రావచ్చని తీవ్రంగా హెచ్చరించింది. అనంతరం పిటిషనర్‌కు చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశిస్తూ కేసు విచారణను ముగించింది. హైకోర్టు ఈ వ్యాఖ్యలు పోలీసుల నిర్లక్ష్యానికి లేదా దుష్ప్రవర్తనకు అద్దం పడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఖైదీల భద్రత, సంక్షేమం విషయంలో పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు సూచించడం గమనార్హం. ఈ ఘటన భవిష్యత్తులో పోలీస్ స్టేషన్లలో ఖైదీల పట్ల వ్యవహరించే విధానంలో మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్నారు.