చీఫ్ సెక్రటరీ, అధికారులను జైలుకు పంపిస్తాం: సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 15 May 2025 7:50 AMహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించడంలో జాప్యం చేస్తే చీఫ్ సెక్రటరీతో పాటు సంబంధిత అధికారులను జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. "HCU కంచె గచ్చిబౌలిలో అటవీ ప్రాంతం పునరుద్ధరించకపోతే చీఫ్ సెక్రటరీ మరియు అధికారులను జైలుకు పంపిస్తాం" అని ధర్మాసనం స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ గవాయి పలు ప్రశ్నలు సంధించారు. "అన్నీ సక్రమంగా ఉంటే సెలవులున్న సమయంలో ఎందుకు పని ప్రారంభించారు? సోమవారం చేసుకోవచ్చు కదా?" అని ఆయన ప్రశ్నించారు. వేల సంఖ్యలో చెట్లను అక్రమంగా కొట్టేశారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. "వేల చెట్లు అక్రమంగా కొట్టేశారు. అవన్నీ త్వరగా పునరుద్ధరణ చేయాలి" అని ఆయన అన్నారు.
ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబడుతూ, "ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు పెట్టి చెట్లను తొలగించారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టు కనిపిస్తుంది" అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వానికి మరింత ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.
తదుపరి విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంత పునరుద్ధరణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టు యొక్క ఈ హెచ్చరికలు తెలంగాణ ప్రభుత్వానికి ఒక బలమైన సంకేతంగా పరిగణించవచ్చు.