Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో సంచలన- భారీ అవినీతి కేసు.. ఎవరీ వైఎస్ రెడ్డి?

ఇవేకాక ఇంకా కీలక పత్రాలను కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది.

By:  Tupaki Desk   |   16 May 2025 5:30 PM IST
మహారాష్ట్రలో సంచలన- భారీ అవినీతి కేసు.. ఎవరీ వైఎస్ రెడ్డి?
X

మొన్నటికి మొన్న ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారి, తెలంగాణలోని వైరా మాజీ ఎమ్మెల్యే కుమారుడైన జీవన్ లాల్ రూ.70 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో సీబీఐకి చిక్కడం ఎంతో కలకలం రేపింది. మరో సంస్థ నుంచి రూ.2.5 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్ గా తీసుకున్న వైనమూ బయటకు వచ్చిం. ఈ అధికారి మహారాష్ట్ర రాజధాని ముంబైలో పనిచేస్తున్నారు.

తాజాగా మహారాష్ట్రలోనే వసయ్ విరారా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి వైఎస్ రెడ్డి అవినీతి బాగోతం బట్టబయలైంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావడంతో బిల్డర్లతో కమ్మక్కయి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు తేలింది. తద్వారా వైస్ రెడ్డి భారీగా అక్రమార్జనకు పాల్పడినట్లు స్పష్టమైంది.

2 మహా నగరాల్లో 13 నివాసాలు

ఎంత పెద్ద అధికారి అయినా ముంబై వంటి మహానగరంలో ఒకటో రెండో ఇళ్లు ఉంటాయి. వైఎస్ రెడ్డికి మాత్రం ముంబై, హైదరాబాద్ లలో 13 నివాసాలు ఉన్నాయి. వీటిలో రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో ఏకంగా రూ.23.25 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రూ.9.04 కోట్ల నగదు దొరికాయి.

ఇవేకాక ఇంకా కీలక పత్రాలను కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది.

వసయ్ విరార్ సీవరేజీ (మురుగు నీటి శుద్ధి) పాంట్లతో పాటు డంపింగ్ యార్డులకు కేటాయించిన స్థలాల్లో బిల్డర్లు అక్రమంగా భవనాలు నిర్మించేశారు. గత 16 ఏళ్లలో ఇలాంటి 41 వాణిజ్య, నివాస సముదాయ భవనాలను నిర్మించారు. వీటిపై కేసులు నమోదవగా.. కార్పొరేషన్ లోని అధికారుల అవినీతి బయటపడింది. చివరకు ఈ భవనాలను ప్రజలకు విక్రయించడం కూడా అయిపోయింది. అయితే, అక్రమం అని తెలిసి, కూల్చివేస్తారని తెలిసి కూడా బిల్డర్లు అమ్మేశారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 20న వీటిని కూల్చివేశారు. దీంతో కార్పొరేషన్ అధికారులపైకి కేసు మళ్లింది. ఈడీ లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు.. వైఎస్ రెడ్డిపై నిఘా పెట్టింది.

ఎవరీ వైఎస్ రెడ్డి..?

తెలుగువాడైన వైఎస్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. ఈయన ఆస్తులు కూడా ఎక్కువగా హైదరాబాద్ లోనే కూడబెట్టినట్లు సమాచారం. పూర్తిగా మహారాష్ట్రలోనే పనిచేస్తున్న ఈయన థానేలో 2016లోనే శివసేన కార్పొరేటర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. అప్పట్లోనే ఈయనకు హైదరాబాద్ లో 11 ఫ్లాట్లు, 9 చోట్ల వ్యవసాయ భూములను గుర్తించారు. ఇప్పడు ఏకంగా దాదాపు రూ.10 కోట్ల నగదు దొరికింది.