'పిలిచినప్పుడు పీఎస్ కు రావాలి'.. జగన్ పై మరో కేసు నమోదు!
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సింగయ్య అనే వ్యక్తి మృతికేసులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసులో జగన్ ను ఏ2గా చేర్చారు!
By: Tupaki Desk | 24 Jun 2025 3:21 PM ISTవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సింగయ్య అనే వ్యక్తి మృతికేసులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసులో జగన్ ను ఏ2గా చేర్చారు! జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోవటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విషయలను గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు.
ఇందులో భాగంగా... సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మరణించాడని.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో జగన్ సత్తెనపల్లి పర్యటనలోనూ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ పర్యటనలోనూ వైసీపీ కార్యకర్త ఒకరు చనిపోయారు. ఈ నేపథ్యంలో మరో ఘటనలో జగన్ పై ఇంకో కేసు నమోదైంది.
అవును... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మరో కేసు నమోదైంది. ఇందులో భాగంగా... గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు.
ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్.. గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారనేది ఫిర్యాదు! పైగా.. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు!
ఈ నేపథ్యంలోనే జగన్ తో పాటు వైసీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు! ఈ క్రమంలో.. వీరందరికీ ఇప్పటికే 41ఏ నోటీసులు ఇచ్చిన పోలీసులు.. పిలిచినప్పుడు నల్లపాడు పీఎస్ కు విచారణకు రావాలని సూచించారు!