భారత్-పాక్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్-కేఏపాల్.. ఆడేసుకుంటున్నారు
"నేనే ఆపాను! నేనే ఆపాను ఆ యుద్ధాన్ని! నా ఫోన్ కాల్ తోనే అంతా ఆగిపోయింది. భారత్, పాకిస్తాన్... ఇద్దరూ నా మాట విన్నారు.
By: Tupaki Desk | 16 May 2025 10:06 AM ISTభారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచమంతా ఉత్కంఠగా చూస్తుంటే... అసలు ఆ యుద్ధాన్ని ఆపింది ఎవరు అనే దానిపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోవైపు... ఇద్దరూ తామే యుద్ధాన్ని ఆపామని క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ 'క్రెడిట్ వార్' చూస్తుంటే అసలు యుద్ధం కంటే ఇదే పెద్ద ఎంటర్టైన్మెంట్ అనిపిస్తోంది!
-ట్రంప్ గారి 'గొప్ప' ప్రకటన:
"నేనే ఆపాను! నేనే ఆపాను ఆ యుద్ధాన్ని! నా ఫోన్ కాల్ తోనే అంతా ఆగిపోయింది. భారత్, పాకిస్తాన్... ఇద్దరూ నా మాట విన్నారు. ప్రపంచ శాంతికి నేనే కారణం" - ఇలాంటి డైలాగులు ట్రంప్ గారి నోటి వెంట రావడం కొత్తేమీ కాదు. ఆయన ఏదైనా సాధిస్తే, దానికి పది రెట్లు ఎక్కువ ప్రచారం చేసుకోవడం ఆయన నైజం. భారత్-పాక్ విషయంలో కూడా అదే జరిగింది. పాకిస్తాన్ అమెరికాను వేడుకుందని, ట్రంప్ జోక్యంతోనే కాల్పుల విరమణ జరిగిందని వార్తలు వచ్చాయి. దీన్ని పట్టుకుని ట్రంప్ గారు... "చూశారా, నా పవర్ ఏంటో!" అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేశారు.
-కేఏ పాల్ గారి 'దివ్య' జోక్యం:
ఇక మన కేఏ పాల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే! ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, దానికి పరిష్కారం తన దగ్గరే ఉంటుందని ఆయన నమ్మకం లేదా మనల్ని నమ్మించాలనుకుంటారు. భారత్-పాక్ యుద్ధం అంచున ఉన్నప్పుడు, ఆయన టర్కీలో ప్రత్యక్షమయ్యారు. అక్కడి నుంచే ప్రకటనలు గుప్పించారు. "నేను టర్కీ వచ్చాను కాబట్టే యుద్ధం ఆగింది. కావాలంటే పాకిస్తాన్ బార్డర్ కు వెళ్లి మరీ శాంతిని స్థాపిస్తాను" అంటూ హల్చల్ చేశారు. ఆయన మాటలు వింటుంటే, ఏదో హాలీవుడ్ సినిమాలో సూపర్ హీరో ఎంట్రీ ఇచ్చినట్లుగా అనిపించింది. బార్డర్ కు వెళ్తానన్నారే కానీ, చివరికి వెళ్లారో లేదో ఎవరికీ తెలీదు. బహుశా, ఆయన బార్డర్ దగ్గరకు వెళ్లే లోపే యుద్ధం ఆగిపోయిందేమో!
-సోషల్ మీడియాలో సునామీ:
ట్రంప్, పాల్ ఇద్దరూ తామే యుద్ధాన్ని ఆపామని చెప్పుకోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ వెల్లువెత్తాయి. నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. "అసలు యుద్ధం మొదలుకాకముందే వీళ్లిద్దరూ ఆపేశారా?", "బార్డర్ లో సైనికులు కాదు, ట్రంప్, పాల్ నిలబడితే చాలు, యుద్ధం ఆగిపోతుంది" అంటూ కామెంట్లు చేశారు.
ముఖ్యంగా, ఓ పెళ్లైన జంట చేసిన సెటైరికల్ వీడియో అయితే తెగ వైరల్ అయింది. ఇంట్లో గొడవ పడుతున్న ఆ భార్యాభర్తలు... తమ గొడవను కూడా ట్రంప్ లేదా కేఏ పాల్ ఆపారని చెప్పుకోవడం నవ్వులు పూయించింది. "మా ఇంట్లో గిన్నెలు విసురుకుంటుంటే, ట్రంప్ గారు ఫోన్ చేసి ఆపారు!", "లేదు లేదు, కేఏ పాల్ గారు వచ్చి ప్రార్థన చేయడంతోనే శాంతి నెలకొంది!" అంటూ వాళ్లు చేసిన కామెడీకి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
భారత్-పాక్ యుద్ధం ఎందుకు ఆగింది అనేది రక్షణ రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవాల్సిన విషయం. కానీ, ఆ ఘనత ఎవరికి దక్కుతుంది అనే దానిపై ట్రంప్, కేఏ పాల్ ల మధ్య జరుగుతున్న ఈ పోటీ మాత్రం ప్రపంచానికి మంచి వినోదాన్ని అందించింది. అసలు యుద్ధాన్ని ఆపింది ఎవరైనా కావొచ్చు కానీ, ఈ ఇద్దరి వల్ల మాత్రం సోషల్ మీడియాలో నవ్వుల యుద్ధం మాత్రం పీక్స్ కు చేరింది అనడంలో సందేహం లేదు!