తిరుమలేషుడికి బంగారు ఆభరణాలు తొడిగించిన ఐపీఎల్ LSG ఓనర్
తాజాగా, ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా తిరుమల శ్రీవారి ఆలయానికి భారీ విరాళం అందించారు.
By: Tupaki Desk | 16 May 2025 4:59 PM ISTతిరుమల శ్రీవారికి భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడం, విరాళాలు సమర్పించుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. సామాన్యుల నుండి పారిశ్రామిక దిగ్గజాల వరకు ఎంతో మంది దాతలు స్వామి సేవకు తమ వంతు సహాయం చేస్తుంటారు. తాజాగా, ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా తిరుమల శ్రీవారి ఆలయానికి భారీ విరాళం అందించారు.
సంజీవ్ గోయెంకా శ్రీవారికి విలువైన ఆభరణాలను సమర్పించారు. వీటి విలువ దాదాపు రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయన స్వామి వారికి శంఖు, చక్రాలు, వరద, కటి హస్తాల ఆభరణాలను అందించారు. ఈ విరాళాన్ని ఆయన టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. గోయెంకా తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారికి భక్తులు నగదు, బంగారం, ఆభరణాల రూపంలో పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఇటీవల అమెరికాలోని బోస్టన్కు చెందిన ఎన్ఆర్ఐ ఆనంద్ మోహన్ భాగవతుల టీటీడీ ట్రస్టులకు రూ. 1.40 కోట్లు విరాళంగా అందించారు. ఎస్వీ ప్రాణదాన, ఎస్వీ గోసంరక్షణ, ఎస్వీ విద్యా దాన, ఎస్వీ వేద పరిరక్షణ, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్టులకు ఆయన ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి చెక్కులు అందజేశారు.
సంజీవ్ గోయెంకాకు దైవ భక్తి ఎక్కువని చెబుతారు. ఆయన ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో కూడా పలు సందర్భాల్లో తన విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారికి ఆభరణాల రూపంలో విరాళం అందించిన సంజీవ్ గోయెంకాను టీటీడీ అభినందించింది. తీర్థప్రసాదాలు అందించి స్వామి వారి దర్శనభాగ్యం కల్పించింది.