ఇరాన్ రివేంజ్ స్టార్ట్... ఖతర్ లో యూఎస్ ఎయిర్ బేస్ పై దాడి!
అవును... ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉదృతంగా మారిందని అంటున్న వేళ.. ఇరాన్ ఓ ముందడుగు వేసింది.
By: Tupaki Desk | 23 Jun 2025 11:00 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇరాన్ లోని అణుకేంద్రాలపై అమెరికా దాడి చేసింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ క్షిపణులు, బంకర్ బ్లస్టర్ బాంబులతో మూడు కీలక అణుకేంద్రాలను ధ్వంసం చేసింది! ఈ నేపథ్యంలో అమెరికాను హెచ్చరించిన ఇరాన్.. తాజాగా పని మొదలుపెట్టింది.
అవును... ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉదృతంగా మారిందని అంటున్న వేళ.. ఇరాన్ ఓ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా... సోమవారం ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఆరు క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
ఖతార్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ పేలుడు శబ్దాలు వినిపించడం గమనార్హం. ఖతార్ లోని అమెరికాకు చెందిన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఈ స్థావరం పశ్చిమాసియాలోనే అతిపెద్దది కాగా.. ఇక్కడ సుమారు 10 వేలమంది అమెరికన్ సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన ప్రత్యక్ష సాక్ష్యులు... ఇరాన్ క్షిపణులను ప్రయోగించిన కొద్దిసేపటికే ఖతార్ రాజధాని దోహాపై పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాక్, సిరియాల్లోని అమెరికా ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ క్షిపణులను ప్రయోగించినట్లు కథనాలొస్తున్నాయి.
వాస్తవానికి తమ దేశంలోని అణుకేంద్రాలపై చేసిన దాడులకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... యుద్ధం ప్రారంభించింది అమెరికా అయినప్పటికీ.. ముగింపు పలికేది మాత్రం తామేనని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే... ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇరాన్ ప్రతీకార దాడులు షురూ చేయడం గమనార్హం!
కాగా... ఇదే ఎయిర్ బేస్ నుంచి గత రెండు వారాలుగా సుమారు 40 మిలటరీ విమానాలు అదృశ్యమైనట్లు శాటిలైట్ చిత్రాలు ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతుండడంతో ఇరాన్ దాడుల నుంచి తమ ఆస్తులను రక్షించుకోవడం కోసమే అమెరికా వాటిని తరలించి ఉంటుందని నాడు నిపుణులు స్పందించారు.