Begin typing your search above and press return to search.

చింత చచ్చినా పులుపు చావని పాక్..శాంతి మంత్రాన్ని జపిస్తూ.. కశ్మీర్ అంటూ పాక్ ప్రధాని కొత్త రాగం

పాక్ తో తాము ఉగ్రవాదం.. పాక్ అక్రమిత కశ్మీర్ మినహా మరే అంశాల మీదా చర్చలు జరపమని తేల్చి చెప్పేయటం ద్వారా.. కశ్మీర్ పాటను పాడే అవకాశం ఇవ్వకుండా తలుపులు మూసేయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 May 2025 10:46 AM IST
చింత చచ్చినా పులుపు చావని పాక్..శాంతి మంత్రాన్ని జపిస్తూ.. కశ్మీర్ అంటూ పాక్ ప్రధాని కొత్త రాగం
X

ఏదో అనుకుంటే మరేదో అయిందన్నట్లుగా మారింది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి. భారత్ కంట్లో నులుసులా మారి చిరాకు పుట్టించటం.. కశ్మీర్ మంటను లైవ్ లో ఉంచేందుకు వీలుగా కుయుక్తులు పన్నే దాయాదికి ఆపరేషన్ సిందూర్ తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. భారత్ ను తక్కువగా అంచనా వేసిన దానికి పాక్ ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకోవటమే కాదు.. కశ్మీర్ మీద మాట్లాడేందుకు అవకాశం లేని రీతిలో భారత్ రియాక్టు అవుతున్న వేళ.. కొత్త ఎత్తుకు సిద్ధమవుతున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.

తాజా ఉద్రిక్తతల్లో భారత్ ను దారుణంగా దెబ్బ తీశామని బీరాలు పలికి.. సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకొని తమను తాము గొప్పగా ప్రొజెక్టు చేసుకున్నప్పటికీ.. నిజాల్ని దాచలేని దైన్యం.. భారత్ జరిపిన దాడుల్లో పాక్ కు జరిగిన భారీ నష్టానికి సంబంధించిన చేదు వాస్తవాలు ప్రపంచానికి తెలియటంతో కక్కా లేక మింగా లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో మరో అడుగు ముందుకు వేసిన మోడీ.. పాక్ తో చర్చలు ఏమైనా జరుగుతాయి అంటే.. అది కేవలం రెండు అంశాల మీదనే అంటూ కుండబద్ధలు కొట్టేయటం తెలిసిందే.

పాక్ తో తాము ఉగ్రవాదం.. పాక్ అక్రమిత కశ్మీర్ మినహా మరే అంశాల మీదా చర్చలు జరపమని తేల్చి చెప్పేయటం ద్వారా.. కశ్మీర్ పాటను పాడే అవకాశం ఇవ్వకుండా తలుపులు మూసేయటం తెలిసిందే. మూకుమ్మడి దాడి మాదిరి.. భారత్ తో పెట్టుకున్న దానికి తగిన శాస్తి జరిగిన నేపథ్యంలో.. డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు పాక్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ కు ముందున్న పరిస్థితిని అయినా తిరిగి తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.

భారత్ తో శాంతి చర్చలకు తాము సిద్దమంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ రీతిలో అయితే సైనిక స్థావరాన్ని సందర్శించి.. సైనికులను అభినందించిన పరిస్థితుల్లో పాక్ ప్రధాని సైతం అలాంటి మార్గాన్నే ఎంచుకున్నారు. పాక్ లోని పంజాబ్ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా కొత్త రాగాన్ని అందుకున్నారు.

శాంతి కోసం భారత్ తో చర్చలకు తాము సిద్ధమన్న ఆయన.. అయితే చర్చల్లో కశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలన్న షరతును తీసకొచ్చారు. ఆయన మాటల్ని చూస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం ద్రష్టిలో భారత్ బాధ్యత కలిగిన దేశంగా కనిపించిన వేళ.. భారత్ తో తాము కయ్యాన్ని కోరుకోవటం లేదని.. శాంతి కోసం తాము కూడా తపిస్తున్న కలరింగ్ ఇచ్చుకునే వ్యూహంలో భాగంగా.. శాశ్వితంగా మూసుకుపోయి కశ్మీర్ ద్వారాల్ని తెరిపించే చిన్న ప్రయత్నాన్ని ఆయన తీసుకొచ్చినట్లుగా చెప్పాలి. మరి.. దీనికి భారత్ ఎలాంటి సమాధానం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.