Begin typing your search above and press return to search.

పాక్ అణు బాంబులు తీసేసుకోండి !

పాకిస్థాన్ అన్నది ఒక దేశంగా భౌగోళికంగా ఉన్నా కూడా అక్కడా వ్యవస్థలు మాత్రం ఒక్క తీరుగా లేవు అనే అంటారు.

By:  Tupaki Desk   |   16 May 2025 9:21 AM IST
పాక్ అణు బాంబులు తీసేసుకోండి !
X

పాకిస్థాన్ అన్నది ఒక దేశంగా భౌగోళికంగా ఉన్నా కూడా అక్కడా వ్యవస్థలు మాత్రం ఒక్క తీరుగా లేవు అనే అంటారు. పాక్ విషయంలో పాలించేది ఎవరు శాసించేది ఎవరు అంటే చాలానే చెప్పాల్సి ఉంటుంది. పేరుకు ఉన్న ప్రభుత్వం మీద సైన్యం పెత్తం ఉంటుంది. ఆ సైన్యాన్ని ఆడించే స్థితిలోకి అక్కడ ఉగ్రమూకలు వచ్చేశాయి.

అంటే పాక్ లో అంతిమ నిర్ణయాలు అధికారాలు ఎవరి దగ్గర ఉంటాయో చాలా ఈజీగానే అర్ధం చేసుకోవచ్చు. అయితే పాక్ వద్ద లక్షలాది మానవాళినే కాదు ప్రకృతినే సర్వ నాశనం చేసే అణు బాంబులు ఉన్నాయి. పాక్ చేతిలో ఆయుధాలు అయినా అధికారం అయినా పిచ్చోడి చేతిలో రాయి కిందనే లెక్క. అలాంటిది అణు బాంబు ఉంటే ఇంకా ఏమైనా ఉందా.

పైగా భారత్ కోసమే తాము అణ్వస్త్ర దేశంగా మారినట్లుగా పాక్ చెబుతూ వస్తోంది. మరో వైపు చూస్తే అన్న వస్త్రాలకు పాక్ లో కరవు ఉంది. కనీ అణ్వస్త్రాలకు మాత్రం అసలు చాన్సే లేదు. వందల కొద్దీ బాంబులు రెడీ చేసి పెట్టుకుంది. పగతో రగిలిపోతున్న పాక్ ఉన్మాదంతో ఊగిపోతున్న ఉగ్రవాదం కక్షతో సాధించే సైన్యం ఇలా అంతా కలిస్తే వినాశనమే.

అందుకే భారత్ ఇపుడు కొత్త డిమండ్ చేస్తోంది. పాక్ నుంచి అణు బాంబులు స్వాధీనం చేసుకోవాలని భారత్ కోరుతోంది. పాకిస్థాన్ దగ్గర ఉన్న అన్ని అణుబాంబులను ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ విజ్ఞప్తి చేశారు.

ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొదటిసారిగా జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత లేని పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండటం మంచిది కాదని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేసిన అతి పెద్ద పోరాటంగా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారతదేశం ఎంతవరకైనా వెళ్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూనే పాక్ ప్రమాదకారి అన్న మాటను అనకుండానే లోకానికి చెప్పేశారు.

బాధ్యత లేని పాక్ నుంచి అణు బాంబులు తీసుకోవాలన్న ఆయన విజ్ఞప్తిని ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏ మేరకు పరిశీలిస్తుంది అన్నది కూడా చూడాలి. పాక్ ఒక దేశంగా బయట ప్రపంచానికి ఉంది. అలా ఆ దేశం తనకంటూ స్వీయ రక్షణకు ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చు. అణు బాంబులను కూడా రెడీ చేసుకోవచ్చు. భారత్ వద్ద ఇతర దేశాల వద్ద అణు బాంబులు ఉన్నాయి.

ఇక రష్యా వద్ద కూడా అణు బాంబులు ఉన్నాయి. ఉక్రెయిన్ ఎంతలా కవ్వించినా యుద్ధం ఏళ్ళ తరబడి సాగుతున్నా కూడా రష్యా అణు బాంబులను తీయలేదు ఎందుకంటే రష్యాకు విచక్షణ ఉంది. అణు బాంబులు వేస్తే ఏమి జరుగుతుందో కూడా తెలుసు.

కానీ కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నట్లుగా పాక్ కి బాధ్యత ఏముంది అన్న చర్చ సాగుతోంది. కేవలం మూడు రోజుల పరిమిత స్థాయి దాడులకే వణికిన పాక్ అణు బాంబులు వేస్తామని బెదిరించే దాకా వచ్చింది. అంతలా సహనం లేని పాక్ తోనూ పాక్ వద్ద ఉన్న అణు బాంబులతోనూ ఉంటే పక్కలో పాముతో ఉన్నట్లే. అందుకే రాజ్ నాధ్ సింగ్ సరైన విజ్ఞప్తినే చేశారు.

కానీ పాక్ కి అగ్ర దేశాల మద్దతు ఉంది. పాక్ అవసరం వారికి చాలా ఉంది. భారత్ ని అణచాలని తగ్గించాలని చూసేవారికి పాక్ తో ఇంకా అవసరం ఉంది. అందుకే పాక్ కి వారు ప్రోత్సహిస్తారు తప్ప అణు బాంబులు స్వాధీనం చేసుకోనిస్తారా. ఏది ఏమైనా భారత్ బాధ అయితే ప్రపంచ బాధ కాదు. అందుకే భారతే ఉగ్ర పోరును ఒంటరిగా సాగించాఇ. పాక్ ని కూడా కోరలు తీసిన పామును చేయాలి. అది ఎలాగో తానే అదను చూసి చేయాల్సిందే.