పాకిస్తాన్ పరువు తీస్తున్న బిచ్చగాళ్లు.. వేలాది మందిని వెనక్కి పంపిన సౌదీ!
ఒకప్పుడు స్నేహ హస్తం అందించిన దేశాల ముందు కూడా చేయి చాచే దుస్థితిలో పాకిస్తాన్ ఉండటం అత్యంత బాధాకరం.
By: Tupaki Desk | 16 May 2025 7:00 PM ISTఒకప్పుడు స్నేహ హస్తం అందించిన దేశాల ముందు కూడా చేయి చాచే దుస్థితిలో పాకిస్తాన్ ఉండటం అత్యంత బాధాకరం. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మూడేళ్ల క్రితం అన్న మాటలు నేడు అక్షరాలా నిజమవుతున్నాయి. "మేము ఏ మిత్రదేశానికి వెళ్లినా, అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటలు ఎంత నిజమో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలు రుజువు చేస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా అప్రతిష్ట మూటగట్టుకుంటోంది.
తాజాగా సౌదీ అరేబియాలో పాకిస్తాన్కు చెందిన వేలాది మంది బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగా తిప్పి పంపింది. ఏకంగా 5,033 మంది పాక్ యాచకులను సౌదీ అధికారులు వెనక్కి పంపించగా, మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల జాతీయ అసెంబ్లీలో వెల్లడించినట్లు డాన్ పత్రిక కథనం పేర్కొనడం గమనార్హం. ఈ గణాంకాలు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
2024 జనవరి నుంచి ఇప్పటివరకు మిత్ర దేశాలు వెనక్కి పంపిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్యను కలిపితే అది 5,402కు చేరుకుంటుందని మంత్రి నక్వీ తెలిపారు. సౌదీ అరేబియాతో పాటు ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యూఏఈ వంటి దేశాలు కూడా పాక్ యాచకులను తమ దేశాల నుంచి బహిష్కరించాయి. ఈ మొత్తం సంఖ్యలో సింధ్ ప్రావిన్స్కు చెందిన వారు అత్యధికంగా 2,795 మంది ఉండగా, పంజాబ్ నుండి 1,437 మంది, ఖైబర్ పఖ్తున్ఖ్వా (కేపీ) నుంచి 1,002 మంది, బలూచిస్తాన్ నుంచి 125 మంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) నుంచి 33 మంది, ఇస్లామాబాద్ నుంచి 10 మంది ఉన్నారు. సంపన్న ప్రావిన్స్ల నుంచి ఎక్కువ మంది యాచకులు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ పరిస్థితి కారణంగా ఇతర దేశాలు పాకిస్తాన్కు వీసాలు జారీ చేయడం కూడా కష్టంగా మారుతోంది. పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏప్రిల్ 19న సియాల్కోట్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..దేశంలో యాచన ఒక పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నారని వీరి నెలసరి ఆదాయం 4,200 కోట్ల పాకిస్తానీ రూపాయలని ఆయన స్వయంగా వెల్లడించారు. సియాల్కోట్ నుంచి రెండుసార్లు వారిని తొలగించినప్పటికీ వారు మళ్లీ తిరిగి వస్తున్నారని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు.
2023లో పాక్ సెనేట్ ప్యానెల్ ఎదుట నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ మాట్లాడుతూ..విదేశాలలో అరెస్టవుతున్న 90 శాతం బిచ్చగాళ్లు పాకిస్తాన్కు చెందినవారేనని తెలిపారు. చాలా మంది టూరిస్టు వీసాలు తీసుకొని సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి ప్రదేశాలకు వెళ్లి అడుక్కుంటున్నారని ఆయన చెప్పారు. అంతేకాకుండా, జపాన్ వారికి కొత్త కేంద్రంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు పాకిస్తాన్ అంతర్జాతీయ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. దేశం ఆర్థికంగా బలహీనంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.