చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారత్ బ్రహ్మోస్ క్షిపణులను తట్టుకోలేక పోయింది ... యూఎస్ మాజీ కల్నల్!
ఆపరేషన్ సిందూర్ తో భారత్... ఒకే దెబ్బకు రెండు పిట్టల ఫలితాన్ని పొందినట్లు చెబుతున్నారు నిపుణులు.
By: Tupaki Desk | 16 May 2025 5:11 PM ISTఆపరేషన్ సిందూర్ తో భారత్... ఒకే దెబ్బకు రెండు పిట్టల ఫలితాన్ని పొందినట్లు చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ తో పాక్ లో 100 మందికి పైగా ఉగ్రమూకలను మట్టుబెట్టి, వారి స్థావరాలను నేలపట్టం చేసి, పాక్ సైన్యాన్ని వణికించేసి, ఆ దేశ ప్రధాని సేఫ్ హౌస్ కు పారిపోయె స్థాయిలో దెబ్బకొట్టింది! మరోవైపు చైనా ఆయుధాల పరువు తీసిందని చెబుతున్నారు.
అవును... ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ పై భారత్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ గాల్లో నిర్వీర్యం చేసింది. దీంతో... పాక్ ఉపయోగించిన ఆయుధాల్లో సుమారు 80% చైనా తయారుచేసిన ఆయుధాలే కావడంతో.. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో ఆ దేశ ఆయుధాలకు డిమాండ్ తగ్గాయని అంటున్నారు.
ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైందని చెబుతున్నారు. అది చాలదన్నట్లుగా తాజాగా అమెరికా యుద్ధరంగ నిపుణుడు కల్నల్ (రిటైర్డ్) జాన్ స్పెన్సర్.. చైనా ఆయుధాలను భారత ఆయుధాలతో కంపేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా.. బ్రహ్మోస్ క్షిపణి ప్రస్థావన తెచ్చారు. ఇందులో భాగంగా... భారత్ దాడి, రక్షణాత్మక విషయాల్లో ఆదిపత్యం ప్రదర్శించిందని అన్నారు.
ఇదే సమయంలో... పాకిస్థాన్ లోని ఏ ప్రదేశాన్ని అయినా భారత్.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఢీకొనగలమనే సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ ఇచ్చిందని చెప్పారు. ఇదే సమయంలో... పాకిస్థాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారత్ బ్రహ్మోస్ క్షిపణులను తట్టుకోలేకపోయిందని తెలిపారు. మరోవైపు... పాక్ డ్రోన్ దాడులు, క్షిపణులను భారత్ సక్సెస్ ఫుల్ గా ఎదుర్కొందని స్పెన్సర్ వివరించారు.
కాగా... మోడరన్ వార్ ఇనిస్టిట్యూట్ అర్బన్ వార్ ఫేర్ స్టడీస్ అధిపతిగా పనిచేస్తున్న స్పెన్సర్.. పాకిస్థాన్ ఉపయోగించిన చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేధించిందని.. ఇది భారత అధునాతన సైనిక సామర్థ్యాలకు తాజాగా నిదర్శనమని వెల్లడించారు. దీంతో.. చైనా ఆయుధాల పరువు అమెరికా అధికారి అధికారికంగా తీసేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.