పహల్గాం ఉగ్రవాదులకు సంబంధించి తెరపైకి షాకింగ్ విషయం!
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jun 2025 3:31 PM ISTఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ పాశవిక చర్యకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. ఆ సంగతి అలా ఉంటే... ఈ ఘటనకు పాల్పడిన ముష్కరులకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... ముష్కరులు ఈ ప్రాంతల్లో రెండేళ్లుగా యాక్టివ్ లో ఉన్నారంట.
అవును... జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో సుమారు రెండు నెలల క్రితం జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ముష్కరులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ ముష్కరులకు సంబంధించిన పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా.. వీరు ఎప్పటి నుంచి యాక్టివ్ గా ఉన్నారనే విషయం వైరల్ గా మారింది.
పహల్గాం ఉగ్ర దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల జాడను భద్రతా సంస్థలు సేకరించాయి! ఇందులో భాగంగా... ఈ ఉగ్రవాదులు పూంచ్ లోని డెహ్రాకిగలి ద్వారా భారత్ లోకి చొరబడ్డారు. ఈ క్రమంలో.. 2022 చివర నుండి లేదా 2023 మొదటి నుంచి జమ్ముకశ్మీర్ అంతటా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడయ్యిందని తెలుస్తోంది. అప్పటి నుంచి జమ్మూప్రాంతంలో ఈ ఉగ్రమూకలు యాక్టివ్ గా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో... ఈ ముష్కరుల బృందం తొలిసారిగా 2023 డిసెంబర్ 21న పూంచ్ లోని సురాన్ కోట్ లో జరిగిన దాడిలో పాల్గొంది. నాటి దాడిలో నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం.. 2024 మేలో బక్రాబల్ మొహల్లా వద్ద భారత వైమానిక దళ కాన్వాయ్ పై జరిగిన మెరుపుదాడిలోనూ వీరి ప్రమేయం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని అంటున్నారు.
ఈ విధంగా పూంచ్ లోని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలలో నెలల తరబడి కార్యకలాపాలు సాగించిన ఈ బ్యాచ్... 2024లో కశ్మీర్ కు తన స్థావరాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుద్గాం చేరుకున్న తర్వాత, ఆ బృందం రెండు చిన్న మాడ్యూల్ లుగా విడిపోయిందని చెబుతున్నారు. అందులో ఒకటి గుల్మార్గ్ వైపు, మరొకటి సోన్ మార్గ్ వైపు కదిలిందని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే అక్టోబర్ 20న.. స్థానిక ఉగ్రవాది అయిన జునైద్, ఒక పాకిస్తానీ సహచరుడితో కలిసి సోన్ మార్గ్ సమీపంలో స్థానికేతర కార్మికులపై కాల్పులు జరిపాడు. అక్టోబర్ 26న మరొక బృందం గుల్మార్గ్ లోని ఆర్మీ ట్రక్కులపై దాడి చేసింది. అనంతరం పహల్గాం దాడిని అమలు చేయాలని వీరు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఆ దాడికి ముందు రెండు చిన్న మాడ్యూల్లు తిరిగి సమావేశమయ్యాయని దర్యాప్తులు సూచిస్తున్నాయి!