Begin typing your search above and press return to search.

బిగ్ షాక్... చైనా ఆయుధాలకు బేరాల్లేవమ్మా!

2010 నుంచి 2020 వరకూ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా చైనా ఉంది. అయితే... ఆపరేషన్ సిందూర్ తాజాగా చైనాకు పెద్ద దెబ్బకొట్టిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 May 2025 11:00 PM IST
బిగ్ షాక్... చైనా ఆయుధాలకు బేరాల్లేవమ్మా!
X

గతకొంతకాలంగా ప్రపంచ ఆయుధ వ్యాపారంలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరిగా చైనా ఎదుగుతుంది. ఈ క్రమంలో గత దశాబ్ధంలో చైనా నికర ఆయుధ ఎగుమతిదారుగా ఉంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐ.ఎస్.పీ.ఆర్.ఐ) డేటా ప్రకారం... 2010 నుంచి 2020 వరకూ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా చైనా ఉంది. అయితే... ఆపరేషన్ సిందూర్ తాజాగా చైనాకు పెద్ద దెబ్బకొట్టిందని అంటున్నారు.

అవును... యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ తర్వాత ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా చైనా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 2010 - 20 మధ్య చైనా ప్రపంచవ్యాప్తంగా సుమారు 16.6 బిలియన్ల టీఐవీ (ట్రెండ్ ఇండికేటర్ విలువలు) సంప్రదాయ ఆయుధాలను ఎగుమతి చేయగా.. అందులో సుమారు 77.3 శాతం ఆసియా దేశాలకు వెళ్లగా.. మిగిలిన వాటిలో 19.1% ఆఫ్రికా, మిగిలిన 3.6 ఇతర ప్రాంతాలకు వెళ్లింది.

ఇందులోనూ ఆసియాలో ప్రధానంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చైనా ఆయుధాలు సరఫరా చేసినట్లు చెబుతున్నారు. ఇక తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం... ప్రతీకార ప్రయత్నాలు చేసిన పాకిస్థాన్ ఉపయోగించిన ఆయుధాల్లో సుమారు 80% వరకూ చైనా మేడ్ ఆయుధాలే అని అంటున్నారు. అయితే... వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా నిర్వీర్యం చేసింది.

ఇదే సమయంలో... పాక్ గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేసి.. ఆ దేశంలోని ఎయిర్ బేస్ లపై సక్సెస్ ఫుల్ గా దాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ వాడిన మెజారిటీ ఆయుధాలు చైనా మేడ్ అని అంటున్నారు. దీంతో... చైనా ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో... కాల్పుల విరమణ జరిగింది కాబట్టి సరిపోయింది కానీ.. ఈ చైనా ఆయుధాలతో యుద్ధం కంటిన్యూ చేస్తే పాకిస్థాన్ పరిస్థితి ఏమిటి అనే చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మొదలైందని చెబుతున్నారు. దీంతో... ప్రపంచ ఆయుధ మార్కెట్ లో చైనా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు. అటు దాడి విషయలోనూ, ఇటు రక్షణాత్మక చర్యల విషయంలోనూ ఫెయిల్ అయ్యాయని అంటున్నారు.

ప్రధానంగా పాకిస్థాన్ పూర్తిగా చైనా రక్షణ ఉత్పత్తులపై ఆధారపడి ఉందని నివేదికలు చెబుతున్నాయి! అయితే.. ఇటీవల భారత్ పై దాడికి యత్నించిన డ్రోన్ లు తుర్కియే తయారుచేసినవి అని అంటున్నా... సింహ భాగం ఆయుధాలు మాత్రం చైనా నుంచే సరఫరా అయినట్లు చెబుతున్నారు. దీంతో... ఆపరేషన్ సిందూర్ అనంతరం చైనా ఆయుధాల కొనుగోళ్లు గరిష్టంగా పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో... తాజాగా పీవోకేతో పాటు నేరుగా పాకిస్థాన్ లోని కీలక ప్రాంతాల్లో భారత్ సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైమానిక దాడులను గుర్తించడంలో పాక్ వాడుతున్న చైనా రాడార్ల వ్యవస్థ పూర్తిగా విఫలమైందని అంటున్నారు. అయితే.. చైనా రాడార్ వ్యవస్థలతో పాక్ దెబ్బతినడం ఇదే తొలిసారి కాదు.

వాస్తవానికి 2019 బాలకోట్ వైమానిక దాడి సమయంలో.. పాక్ రాడార్ వ్యవస్థ కవరేజ్ పూర్తిగా ఫెయిలైంది. ఇక.. 2022 మార్చి9న హర్యానా నుంచి అనుకోకుండా సూపర్ సోనిక్ బ్రహ్మాస్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించడం జరిగింది! ఆ క్షిపణి భారత గగనతలంలో 100 కి.మీ, పాకిస్థాన్ భూభాగంలో మరో 105 కి.మీ. ప్రయాణించి నేరుగా పంజాబ్ ప్రావిన్స్ లో కూలిపోయింది.

ఇలా భారత క్షిపణి తమ భూభాగంలో సుమారు 105 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ ఏ దశలోనూ పాకిస్థాన్ రాడర్ ఈ క్షిపణిని గుర్తించలేదు! ఈ ఘటనపై పాక్ సైన్యం బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎల్.వై-80 వ్యవస్థలోని 388 లోపాల జాబితాను చైనాకు అందజేసింది. వీటిలో 255 లోపాలను తక్షణం పరిష్కరించాలని వర్గీకరించాయి.. దీంతో పాక్ రాడార్ల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలోనే... చైనా తయారుచేసిన ఆయుధాల విషయంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైందని అంటున్నారు. చైనా ఆయుధాలను నమ్ముకుని యుద్ధానికి దిగితే.. అది ఆత్మహత్యా సదృశ్యమే అని చెబుతున్నారు! దీంతో... ఆయుధ మార్కెట్ లో చైనా సరుకుకు బేరాలు తగ్గిపోతున్నాయని అంటున్నారు!