Begin typing your search above and press return to search.

ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని మా విధానం!

ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని అనేది త‌మ విధాన‌మ‌ని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. అయితే.. రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చ‌యంతో ఉన్నామ‌ని తెలిపారు.

By:  Tupaki Desk   |   16 May 2025 5:02 PM IST
ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని మా విధానం!
X

ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని అనేది త‌మ విధాన‌మ‌ని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. అయితే.. రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చ‌యంతో ఉన్నామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో అభివృద్దిని వికేంద్రీక‌రిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధికి కీల‌క‌మైన పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్టు తెలిపారు. ఉద్యోగం, ఉపాధి క‌ల్ప‌న‌లే ల‌క్ష్యంగా పెట్టుబ‌డు ల‌ను ఆహ్వానిస్తున్నామ‌న్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో `రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్` కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలసి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఈ సోలార్ ప్రాజెక్టుకు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులను ప్రోత్సాహిస్తు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు.

పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో భార‌త దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా ఇది నిలుస్తుంద‌న్నారు. దీనివ‌ల్ల వేలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని తెలిపారు. త‌మ‌ది మాటల ప్ర‌భుత్వం కాద‌న్న నారా లోకే ష్ వ‌చ్చే నాలుగేళ్ల‌లో 20 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే దిశ‌గా అడుగులు వేస్తున్న ట్టు చెప్పారు. కొంద‌రు(వైసీపీపైప‌రోక్షంగా) చేస్తున్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని కోరారు. సూప‌ర్ సిక్స్‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేసేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌ణాళిక రూపొందించార‌ని తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశ‌నం చేసింద‌ని.. అమ‌రావ‌తిని అప్ప‌ట్లోనే అభివృద్ధి చేసి ఉంటే.. ఇప్పుడు ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా ఉండేద‌ని తెలిపారు. ఇప్పుడు అమ‌రావ‌తిని ఒక కొలిక్కి తీసుకువ‌చ్చామ‌ని.. అభివృద్ధి ప‌నులు ముందుకు సాగుతున్నాయ‌ని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వాలు.. ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి ఫ‌లాల‌ను అందిస్తున్నాయ‌ని చెప్పారు. వ‌చ్చే నెల‌లో త‌ల్లికి వంద‌నం అమ‌లు చేస్తామ‌ని.. చ‌దువుకునే పిల్ల‌లు ఎంత మంది ఉన్నా.. రూ.15000 చొప్పున అందిస్తామ‌ని ఈ విష‌యంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేద‌ని చెప్పారు.