వణికిపోతున్న అమెరికా.. టేలర్ స్విఫ్ట్ సౌధం సమీపంలో మనిషి అవశేషాలు!
రోడ్ ఐలాండ్లోని మసాచుసెట్స్లో ఈ భయానక ఆవిష్కరణ జరగడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
By: Tupaki Desk | 16 May 2025 5:00 PM ISTఅమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ ప్రాంతం ప్రస్తుతం భయంతో వణికిపోతోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఒక సీరియల్ కిల్లర్ వరుస దారుణ హత్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా, పాప్ సంగీత ప్రపంచంలో తిరుగులేని తారగా వెలుగొందుతున్న టేలర్ స్విఫ్ట్ నివాసం సమీపంలో మానవ అవశేషాలు బయటపడటం ఈ భయాలకు మరింత బలం చేకూర్చింది. రోడ్ ఐలాండ్లోని మసాచుసెట్స్లో ఈ భయానక ఆవిష్కరణ జరగడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఇదే తరహాలో న్యూ ఇంగ్లాండ్లోని కనెక్టికట్, రోడ్ ఐలాండ్, మసాచుసెట్స్ ప్రాంతాల్లో గత కొంతకాలంగా మానవ అవశేషాలు బయటపడుతుండటం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో, ఒక సీరియల్ కిల్లర్ ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో భయంకరమైన నేరాల పరంపర కొనసాగుతుండటంతో ప్రజలు తమ భద్రత గురించి తీవ్రంగా కలవరపడుతున్నారు.
ఎవెరెట్ అవెన్యూ ప్రాంతంలోని బీచ్లో మానవ అవశేషాలు కొట్టుకువస్తున్నాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల మసాచుసెట్స్లో ఐదు మృతదేహాలు, కనెక్టికట్లో ఐదు మృతదేహాలు, రోడ్ ఐలాండ్లో మూడు మృతదేహాలు, టౌంటన్ అనే చిన్న పట్టణంలో రెండు మృతదేహాలు కనుగొనబడ్డాయి. తాజాగా, టేలర్ స్విఫ్ట్ నివాసంతో సహా 12 వేర్వేరు ప్రాంతాల్లో మానవుల కాళ్ల ఎముకలు వంటి అవశేషాలను అధికారులు గుర్తించారు. ఈ అవశేషాలలో చాలా వరకు మహిళలకు సంబంధించినవిగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వరుస హత్యల వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, పలు ప్రభుత్వ సంస్థలు ఈ విషయంపై స్పందిస్తూ, ప్రజలకు ధైర్యం చెబుతున్నాయి. తాము తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. అయితే, ఈ భరోసా ప్రజల్లో నెలకొన్న భయాన్ని పూర్తిగా తగ్గించలేకపోతోంది. మరోవైపు ఈ భయానక వరుస హత్యల గురించి టేలర్ స్విఫ్ట్ బృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆమె నివాసం సమీపంలోనే మానవ అవశేషాలు కనుగొనడం మరింత కలకలం రేపుతోంది. ఈ కేసును పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.