ఫైళ్ల క్లియరెన్స్ కు మంత్రులకు డబ్బులు.. వివాదంలో మంత్రి కొండా సురేఖ
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.. ఏ ఉద్దేశంలో అన్నారో కానీ, ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 16 May 2025 1:33 PM ISTతెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.. ఏ ఉద్దేశంలో అన్నారో కానీ, ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఓ సినీ నటుడి కుటుంబాన్ని ఉద్దేశించి సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమె మంత్రి పదవికే గండం తెచ్చేంత పనిచేశాయి. అవి సద్దుమణిగాయో లేదో.. వేములవాడ దేవస్థాన గోశాల వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ’మంత్రులను’ ఉద్దేశించి సురేఖ అన్నట్లుగా ఉన్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇంతకూ ఆమె ఏమన్నారంటే..
వరంగల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడుతూ తమ వద్దకు వచ్చే కంపెనీల ఫైళ్ల క్లియరెన్స్ కు సహజంగా మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారని, తాను మాత్రం సమాజ సేవ చేయాలని సూచించానని పేర్కొన్నారు.
’’వరంగల్ క్రిష్ణ కాలనీ బాలికల జూనియర్ కళాశాల భవనాలు వర్షాకాలం జలమయం అవుతున్నాయి. కొత్త భవనం కట్టాలంటే రూ.4.5 కోట్లు అవుతాయి. ఇంతమొత్తం ఎక్కడినుంచి తేవాలో నాకు అర్థంకాలేదు. నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నందున నావద్దకు కొన్ని ఫైళ్లు వస్తాయి. ఇలాంటివాటిని మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారు. నేను మాత్రం స్కూల్ ను డెవలప్ చేయమని చెప్పా. పేరు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నా. దీంతో అరబిందో సంస్థ వారు ముందుకొచ్చి రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కట్టించారు’’ అని సురేఖ వ్యాఖ్యానించారు.
సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కు లంచాలు తీసుకుంటారనే అభిప్రాయం వెళ్లడంతో ఆమె స్పందించారు. తాను మాట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి మంత్రుల గురించి అని సర్దిచెప్పుకొంటూ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కొండా సురేఖ తెలిపారు.
పాపం సురేఖ
30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా.. మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకున్నా.. కొండా సురేఖకు అన్నీ ఎదురుదెబ్బలే. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం వైఎస్ జగన్ ను సీఎం చేయాలంటూ ఏకంగా ఉమ్మడి ఏపీ మంత్రి పదవినే వదులుకున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో వైఎస్సార్సీపీ తరఫున ఉప ఎన్నికలో పోటీ చేశారు. చివరకు అదే జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక 2014 తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచినా.. ఆ పార్టీతో విబేధించారు. 2018లో టికెట్ రాకపోయేసరికి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మళ్లీ మంత్రి అయ్యారు. కానీ, వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడుతున్నారు.
ఇలా కొండా సురేఖ రాజకీయ జీవితం అంతా సంచలనాలే.
కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా పేరున్న నాయకుడే అయినా.. కేసుల కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి. దీంతో ఎమ్మెల్సీగా సరిపెట్టుకున్నారు.