Begin typing your search above and press return to search.

జనసేన రాజ్యసభ సీటు ఆయనకే రిజర్వ్ అయిందటగా ?

అయితే జనసేన రాజ్యసభ సీటు ఒకరికి ఇప్పటికే రిజర్వ్ అయిపోయింది అని ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   16 May 2025 11:02 AM IST
జనసేన రాజ్యసభ సీటు ఆయనకే రిజర్వ్ అయిందటగా ?
X

జనసేనకు లోక్ సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు నాగబాబుతో కలుపుకుని ఉన్నారు. ఇక చూస్తే కనుక దేశంలోని మరో అత్యున్నత చట్ట సభ ఉంది అదే రాజ్యసభ. మూడు చట్ట సభలలో జనసేన ప్రవేశం దివ్యంగా జరిగిపోయింది. ఇక మిగిలిన ఆ చట్టసభ రాజ్యసభలో కూడా అడుగుపెడితే ఆ కొరత కూడా తీరిపోతొంది. జనసేన పూర్తి స్థాయిలో చట్ట సభలలో తన బలమైన వాణిని వినిపించేందుకు వీలు కలుగుతుంది.

నిజానికి జనసేనకు రాజ్యసభ సీటు ఒకటి ఆఫర్ ఉంది ఏపీలో ఇప్పటిదాకా నాలుగు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అయితే టీడీపీ బీజేపీ వాటిని పంచుకున్నాయి. ఏపీ నుంచి 2026లో ఏకంగా నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. దాంతో అందులో ఒక్కటి పక్కాగా జనసేనకు దక్కుతుందని అంటున్నారు.

నిజానికి రాజ్యసభ సీటు జనసేన నుంచి మెగా బ్రదర్ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నాగబాబుకు ఇస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో జనసేన తరఫున ఎవరికి రాజ్యసభ సీటు ఇస్తారు అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అయితే జనసేన రాజ్యసభ సీటు ఒకరికి ఇప్పటికే రిజర్వ్ అయిపోయింది అని ప్రచారం సాగుతోంది. ఆయన ఎవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అని అంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నందువల్లనే పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుని ఎమ్మెల్సీగా పంపించారు అని అంటున్నారు.

ఇక లింగమనేని రమేష్ టీడీపీ అధినాయకత్వానికి కూడా సన్నిహితుడే. దాంతో ఆయన పేరుని ఆ పార్టీ కూడా సంతోషంగా ఆమోదిస్తుందని అంటున్నారు. ఇక చూస్తే వచ్చే జూన్ లో ఏకంగా నాలుగు రాజ్యసభ సీట్లు ఏపీ నుంచి ఖాళీ అవుతున్నాయి. అందులో వైసీపీకి చెందినవే మూడు ఉన్నాయి. ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ సీటు, మరోటి అయోధ్య రామిరెడ్డి సీటు, ఇంకోటి గుజరాత్ కి చెందిన అదానికి సన్నిహితుడైన పరిమళ నత్వాని. ఇక టీడీపీ నుంచి గత ఏడాది రాజ్యసభకు వెళ్ళిన సానా సతీష్ పదవీ కాలం కూడా పూర్తి అవుతోంది.

అయితే సానా సతీష్ ఎంపీగా గట్టిగా రెండేళ్ళు కూడా ఉండనందున మరోసారి ఆయనకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఇక పరిమళ్ నత్వానీ సీటుని బీజేపీ తీసుకుంటుందని చెబుతున్నారు. మిగిలిన రెండు సీట్లలో ఒకటి జనసేన ఒకటి టీడీపీ తీసుకుంటాయట. ఆ విధంగా చూస్తే వచ్చే ఏడాది ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లలో టీడీపీకి రెండు, జనసేన బీజేపీలకు చెరి ఒకటి దక్కనున్నాయని అంటున్నారు.

జనసేన నుంచి లక్కీ చాన్స్ మాత్రం లింగమనేని రమేష్ తీసుకున్నారు అని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియదు కానీ అదే జరిగితే లింగమనేని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లే. ఆరేళ్ళ పాటు పదవీ కాలం ఉండే పెద్దల సభలో ఎంపీగా అధికారం అందుకున్నట్లే అని అంటున్నారు.