Begin typing your search above and press return to search.

జమిలి ఎన్నికలు వస్తున్నాయి...బాబుకు ఉప్పందిందా ?

జమిలి ఎన్నికలు అని 2014 నుంచి 2019 మధ్యలో ఒక భయంకరమైన ప్రచారం సాగింది.

By:  Tupaki Desk   |   16 May 2025 9:19 AM IST
Bjp Interest Jamili Elections In 2027
X

జమిలి ఎన్నికలు అని 2014 నుంచి 2019 మధ్యలో ఒక భయంకరమైన ప్రచారం సాగింది. ఆ మీదట 2019 నుంచి 2024 మధ్య సాగింది. అయితే ఆ రెండు టెర్ములూ అవి పూర్తిగా గాలి వార్తలు అని తేలిపోయింది. కానీ 2024 నుంచి 2029 మధ్యలో జమిలి ఎన్నికలు వస్తాయని మళ్ళీ ప్రచారం మొదలైంది. మోడీకి ఇది ప్రధానిగా మూడవ టెర్మ్.

కానీ ముచ్చటగా మూడోసారి మొదలైన ఈ ప్రచారం అచ్చంగా నిజం అవుతుంది అని అంటున్నారు. ఢిల్లీ వర్గాల కబురు అయితే జమిలికి రంగం సిద్ధం అయింది. ఆపరేషన్ సిందూర్ సాక్షిగా బలమైన బీజం పడింది అని అంటున్నారు. పాకిస్థా ని ఆపరేషన్ సిందూర్ తో పీచమణచిన మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిండా అయిదేళ్లు మిత్రుల మీద ఆధారపడి కేంద్రంలో అధికారం వెళ్ళదీయాలని అనుకోవడంలేదుట.

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కి కోలుకోలేని దెబ్బ తీసిన మోడీకి అపరిమితమైన ఇమేజ్ వచ్చిందని బీజేపీ పెద్దలు లెక్క వేస్తున్నారు. దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి వాడవాడలా దేశంతా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వీటిని రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రులు నుంచి జిల్లా స్థాయిలో మంత్రులు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు ఇంకా దిగువ స్థాయిలో బీజేపీ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 13న మొదలైన తిరంగా ర్యాలీలు ఈ నెల 23 దాకా 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ నిర్వహించడం వెనక అసలు ఉద్దేశ్యం ఆపరేషన్ సిందూర్ ద్వారా వచ్చిన ఇమేజ్ ని పూర్తిగా రాజకీయంగా మళ్ళించుకోవడం కోసమే అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఎన్నడూ లేని విధంగా ఇపుడు దేశంలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉంది. పాకిస్థాన్ విషయంలో భారత్ మొత్తం ఆప్షన్లు అన్నీ తన వద్దనే ఉంచుకుంది. ఉగ్ర దాడి ఏ మాత్రం జరిగినా ఆ క్రీనీడ కనిపించినా కూడా యుద్ధమే అని ప్రకటించిన నేపధ్యంలో పాక్ తో భారత్ కయ్యానికి కాలు దువ్వాలనుకుంటే దువ్వవచ్చు. అదే విధంగా పాక్ ని కొమ్ములు విరిచి మూల కూర్చోబెట్టిన ఖ్యాతి కూడా భారత్ సొంతం అవుతుంది కూడా.

ఈ నేపధ్యంలోనే కుల గణన కూడా బీజేపీ తన అమ్ముల పొది నుంచి తీస్తోంది అది కనుక జరిపించి బీసీలకు ఓబీసీలకు పెద్ద పీట వేస్తే బీజేపీ రాజకీయం మరింతగా పండుతుంది. దాంతో 2026లో జనాభా గణన కుల గణన ఒకేసారి చేపట్టి 2027 మధ్యలో జమిలి ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచన బీజేపీ చేస్తోంది అన్నది రాజకీయాల్లో వినిపిస్తున్న మాట.

అలా రెండేళ్ళ పాటు అధికారం చేతిలో ఉన్నపుడే ఎన్నికలకు వెళ్ళడం ద్వారా 2024లో నినదించిన 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక బీజేపీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మిత్రపక్షం అయిన టీడీపీకి తెలిసిపోయిందా అన్నదే మరో చర్చ.

అందుకే బాబు సూపర్ సిక్స్ హామీలు అన్నీ ఒక్కోటీ బయటకు తీస్తూ అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అంతే కాదు వీలైతే మహిళల కోసం మరిన్ని కొత్త పధకాలను కూడా అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. జమిలి ఎన్నికలు ఎపుడు వచ్చినా బీజేపీ జనసేనలతో కలసి ఎన్నికల గోదాలోకి దిగి అధికారం మరోసారి సొంతం చేసుకోవాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి జమిలి ఎన్నికల గురించి మరో మారు చర్చ స్టార్ట్ అయిపోయింది.