Begin typing your search above and press return to search.

సీజ్ ది కార్... జగన్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకెళ్లిన పోలీసులు!

తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో.. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ఏపీ 40 డీహెచ్ 2349 వాహనాన్ని నల్లపాడు స్టేషన్ పోలీసులు తీసుకెళ్లారు!

By:  Tupaki Desk   |   24 Jun 2025 9:16 PM IST
సీజ్  ది కార్... జగన్  బుల్లెట్  ప్రూఫ్  వెహికల్  తీసుకెళ్లిన పోలీసులు!
X

ఏపీ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ను ఏ2 గా చేర్చిన పోలీసులు.. తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో.. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ఏపీ 40 డీహెచ్ 2349 వాహనాన్ని నల్లపాడు స్టేషన్ పోలీసులు తీసుకెళ్లారు!

అవును... పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్‌ పర్యటనకు సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయిన కేసులో పోలీసులు జగన్‌ ను ఏ2 నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు.

ఈ సందర్భంగా.. వైసీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డి ఆ నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం 'ఏపీ 40 డీహెచ్ 2349' ని పోలీసులు తీసుకెళ్లారు. ఇలా సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా అంటూ.. పోలీసులు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

అయితే... ఇప్పటికే సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా ఏపీ 26 0001 నంబర్ గల సఫారీ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసినట్లు చెబుతున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును నల్లపాడు స్టేషన్ పోలీసులు తీసుకెళ్లారు!

మరోవైపు జగన్ పై మరో కేసు నమోదైంది. ఇందులో భాగంగా... గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్‌.. గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారనేది ఫిర్యాదు!

ఇదే సమయంలో... మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్‌ రాజకీయ ప్రసంగాలు చేశారు! ఈ నేపథ్యంలోనే జగన్‌ తో పాటు వైసీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్‌ నాయుడు, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు! ఈ క్రమంలో.. వీరందరికీ ఇప్పటికే 41ఏ నోటీసులు ఇచ్చారు.