భారత్, పాకిస్తానీయులకు నో డిస్కౌంట్స్ అంట..అక్కడేం జరుగుతోంది?
ఇస్తాంబుల్లోని ఒక దుకాణంలో ఎవరో తీసిన వీడియోలో ఈ అవమానకరమైన నోట్ కనిపించింది.
By: Tupaki Desk | 29 April 2025 9:26 PM ISTటర్కీలోని ఇస్తాంబుల్లో ఒక దుకాణంలో పెట్టిన వివాదాస్పద బోర్డు ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్కు చెందిన ప్రజలన ఉద్దేశిస్తూ డిస్కౌంట్లు అడగొద్దంటూ పెట్టిన ఈ బోర్డు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో జనాల్లో తీవ్ర ఆగ్రహం వెళ్లువెత్తుతుంది.
ఇస్తాంబుల్లోని ఒక దుకాణంలో ఎవరో తీసిన వీడియోలో ఈ అవమానకరమైన నోట్ కనిపించింది. కౌంటర్ దగ్గర స్పష్టంగా కనిపించేలా పెట్టిన ఆ నోట్లో ఇలా రాసి ఉంది: "భారతదేశం (India), పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) సోదరులారా.. దయచేసి డిస్కౌంట్లు అడగొద్దు." ఒక వ్యక్తి ఈ బోర్డును వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా, అది క్షణాల్లో వైరల్గా మారింది. "ఇస్తాంబుల్లో దక్షిణాసియా ప్రజలకు ప్రత్యేకంగా ఎలాంటి తగ్గింపులు లేవని రాసి ఉన్న నోట్ను గుర్తించాను" అని వీడియో తీసిన వ్యక్తి రాసుకొచ్చాడు. ఈ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆ దుకాణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ "సరిహద్దుల పరంగా విడిగా ఉంటాం. కానీ, ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు కలిసిపోతాం" అని కామెంట్ చేయగా, మరొక యూజర్ "ఇది ఎంత మాత్రం సరైన చర్య కాదు" అని తన అభిప్రాయాన్ని తెలిపారు. అనేక మంది యూజర్లు ఆ దుకాణం వివక్షాపూరిత వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇది జాతి వివక్షను ప్రోత్సహించే చర్య అని కొందరు మండిపడుతున్నారు.
ఇలాంటి బోర్డులు పెట్టడం ద్వారా ఆ దుకాణం దక్షిణాసియా ప్రజలను కించపరుస్తోందని పలువురు యూజర్లు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారం చేసే చోట ఇలాంటి వివక్ష చూపడం సరికాదని, ఇది ఆ దుకాణం ప్రతిష్టను దిగజారుస్తుందని వారు అంటున్నారు. వెంటనే ఆ బోర్డును తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.