మళ్ళీ యుద్ధం అంటున్న కేంద్ర మంత్రి...నిజమేనా ?
యుద్ధం అంటే తమాషా కాదు, జోక్ అంతకంటే కాదు, సరదా ససేమిరా కానే కాదు. యుద్ధం అంటే మారణ హోమం.
By: Tupaki Desk | 16 May 2025 9:25 AM ISTయుద్ధం అంటే తమాషా కాదు, జోక్ అంతకంటే కాదు, సరదా ససేమిరా కానే కాదు. యుద్ధం అంటే మారణ హోమం. వినాశనం. కోర్టు కేసు గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడు ఓడిన వాడి కోర్టు మెట్ల వద్దనే ఏడుస్తాడు అని ఒక సామెత ఉంది. అలాగే యుద్ధంతో ఎవరూ పూర్తి విజేతలు ఉండరు. గెలిచినా ఎన్నో గాయాలు ఉంటాయి. ఓడిన వారి కంటే మెరుగు అన్న మాటే కానీ నష్టంలో కష్టంలోనూ తీసిపోని తీరుగానే ఉంటుంది.
అందుకే యుద్ధం ఎవరూ కోరుకోరు. ఆ మాటకు వస్తే వద్దురా బాబూ అని ఒక దండం పెడతారు. ఇగోలతో కసితో మొదలైన యుద్ధాలు కూడా ఆపేయడానికే చివరికి చూస్తారు. రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధానికి ఎండ్ కార్డు కోసం రెండు దేశాలూ చూస్తున్నాయి అన్నది తెలిసిందే.
ఇక ట్రంప్ అన్నారనో మరొకరు చెప్పారనో కాదు యుద్ధం వద్దు అని కాల్పుల విరమణకు భారత్ ఓకే చెప్పడం ఎంతో వివేచనతో కూడుకున్నది. ఇంకా చెప్పాలీ అంటే పాక్ వంటి ఒక బాధ్యత లేని దేశంతో అన్ని విధాలుగా సర్వ భ్రష్టత్వం అయిన దేశంతో యుద్ధం చేస్తే బలమైన ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ కూడా ఎటూ కాకుండా పోతుంది. బహుశా ఆ తెలివిడి తోనే మాకు యుద్ధం వద్దు అని భారత్ అంటోంది.
అంత మాత్రం చేత పాక్ ఉగ్ర పీడలను చీడలను భరించడానికి కాదు, అలాంటి సందర్భం వస్తే కనుక భారత్ కచ్చితంగా యుద్ధం పొలిమేరలకు తానే స్వయంగా వెళ్ళి నిలబడుతుంది. అయితే యుద్ధం అన్నది సీరియస్ వ్యవహారం. అందువల్ల ఎపుడు పడితే అపుడు ప్రకటనలు ఇవ్వడం కూడా మంచిది కాదు.
కానీ మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రి రాందాస్ అథవాలే అయితే యుద్ధం మళ్ళీ వస్తుంది అని అంటున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేయాల్సిందేనని లేకపోతే కచ్చితంగా పాక్ తో మరిన్ని యుద్ధాలు వస్తాయని ఆయన హెచ్చరించే ధోరణిలో చెబుతున్నారు.
పీఓకే భారత్లో అంతర్భాగమని పార్లమెంటులోనూ చెప్పామని ఆయన అంటూ అది భారత్ కి అప్పగించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దానిని పాక్ అప్పగించిందా ఓకే లేకపోతే దాని కోసమైనా మరిన్ని యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు కాల్పుల విరమణ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని కేంద్ర మంత్రి అంటున్నారు.
అంటే మళ్ళీ తూటాలు బాంబుల మోత తప్పదని ఆయన చెబుతున్నారా అన్నది కూడా అని అంతా అనుకుంటున్నారు. పీఓకేను భారత్కు అప్పగించాలని.. ఉగ్ర కార్యకలాపాలను నిలిపివేయాలని పాకిస్తాన్ ముందు భారత్ ప్రతిపాదనలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
సరే భారత్ ప్రతిపాదనలు చాలా మంచివి. ప్రతీ పౌరుడూ ఆమోదించేవే. కానీ దాయాది పాక్ వీటికి ఎలా ఒప్పుకుంటుంది అన్నదే కదా ప్రశ్న. కాశ్మీర్ యాపిల్ కోసమే పాక్ ఏడున్నర దశాబ్దాలుగా యుద్ధం చేస్తూ వస్తోంది. అంతే కాదు మూడవ ముక్క అయిన పీఓకేని తన దగ్గర ఉంచుకుని మిగిలిన రెండు ముక్కలను తీసుకోవాలని చూస్తోంది. మొత్తానికి యుద్ధ భయాలు అయితే ఉన్నాయని కేంద్ర మంత్రి చెబుతున్నారులా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.