ఇక నెలనెలా నిరుద్యోగ లెక్కలు... ప్రభుత్వం సంచలన నిర్ణయం!
మనదేశ ఆర్థిక వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 16 May 2025 3:00 PM ISTమనదేశ ఆర్థిక వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వార్షికంగా లేదా త్రైమాసికంగా మాత్రమే విడుదల చేసే నిరుద్యోగ గణాంకాలను ఇకపై నెలనెలా ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆప్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రాం ఇంప్లిమెంటేషన్ (MoSPI) మొట్టమొదటి నెలవారీ నిరుద్యోగ డేటాను రిలీజ్ చేసింది. దీని ద్వారా దేశంలోని శ్రామిక మార్కెట్ తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2025 నాటికి భారతదేశంలో నిరుద్యోగిత రేటు 5.1శాతంగా నమోదైంది. ఈ సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం అంత క్లిష్ట పరిస్థితుల్లో అయితే లేదు. అదే నెలలో యునైటెడ్ స్టేట్స్ నిరుద్యోగిత రేటు 4.2శాతంగా ఉంది. ఇది భారతదేశానికి సాపేక్షంగా దగ్గరగా ఉంది. అయితే, యునైటెడ్ కింగ్డమ్లో నిరుద్యోగిత రేటు 2021 తర్వాత అత్యధికంగా 4.5శాతానికి పెరిగింది. మరోవైపు, పాకిస్తాన్ అంచనా నిరుద్యోగిత రేటు 7.5శాతానికి చేరుకుంది. ఇది ఆందోళనకరమైన విషయం.
భారతదేశం నెలవారీ నివేదికల వైపు అడుగు వేయడాన్ని నిపుణులు ఒక కీలకమైన పురోగతిగా అభివర్ణిస్తున్నారు. క్రమం తప్పకుండా వచ్చే ఈ అప్ డేట్స్ దేశీయ విధాన రూపకల్పనను మెరుగుపరచడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక అంచనాలలో భారతదేశ విశ్వసనీయతను కూడా పెంచుతాయి. స్థిరమైన డేటాతో దేశం ఉద్యోగ సంబంధిత సవాళ్లను త్వరగా పరిష్కరించడానికి అవకాశం లభిస్తుంది.
ఈ కొత్త విధానం ఆర్థిక విశ్లేషకులకు, పరిశోధకులకు మరింత సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది. తద్వారా వారు శ్రామిక మార్కెట్లోని మార్పులను మరింత లోతుగా అర్థం చేసుకోగలరు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయగలరు. అంతేకాకుండా, ఈ డేటా ప్రభుత్వానికి ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి సహాయపడుతుంది.
ప్రభుత్వం ఈ చర్య కేవలం డేటా సేకరణ, విడుదలకే పరిమితం కాకుండా, దాని విశ్లేషణ, తగిన చర్యలు తీసుకోవడంపై కూడా దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. నిరుద్యోగిత అనేది ఒక క్లిష్టమైన సామాజిక-ఆర్థిక సమస్య, దీనిని సమర్థవంతంగా పరిష్కరించడానికి సరైన సమయంలో సరైన సమాచారం అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. ఈ కొత్త నెలవారీ నివేదికల ద్వారా భారతదేశం ఈ దిశగా ఒక బలమైన అడుగు వేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.