రక్షణ బడ్జెట్... పాక్ ను మరింత టెన్షన్ పెట్టేలా కేంద్రం నిర్ణయం!
భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ రక్షణరంగం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 16 May 2025 11:19 AM ISTఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ - పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ నెల 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం ఈ నెల 18 వరకూ ఈ అంగీకారాన్ని పొడిగించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ బడ్జెట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
అవును... భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ రక్షణరంగం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఆ రంగానికి బడ్జెట్ లో అదనంగా రూ.50,000 కోట్లు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ తాజా పెంపు ఆలోచనకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయని సమాచారం.
వాస్తవానికి ఈ ఏడాది రక్షణ శాఖ కేటాయింపుల్లో రూ.6.81 లక్షల కోట్లు ఉన్నాయి. అయితే.. తాజాగా మరో రూ.50,000 కోట్లు కేటాయిస్తే... రక్షణ రంగానికి కేటాయించిన నిధులు సుమారు రూ.7.30 లక్షల కోట్లు దాటనున్నాయి. ఈ అదనపు కేటాయింపులతో సాయుధ దళాలకు అవసరమైన కొనుగోళ్లు, పరిశోధనకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు!
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగం కోసం రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా.. ఇది గత ఆర్ధిక సంవత్సరం కంటే 9.53% ఎక్కువ. ఇక ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గత 10 ఏళ్లలో రక్షణ రంగ బడ్జెట్ సుమారు మూడు రెట్లు పెరిగింది. అంటే 2014-15లో ఈ కేటాయింపులు రూ.2.29 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.6.81 లక్షల కోట్లు అయ్యింది.
కాగా... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తదనంతరం పరిణామాలు.. పాకిస్థాన్ కంటే భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాక్ సంధించిన డ్రోన్లు, క్షిపణులను భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థ ఎక్కడికక్కడ నిలువరించింది. ఈ సమయంలో ఎస్-400 సామర్థ్యం గురించి ఆసక్తిర చర్చ నడిచింది.
ఈ నేపథ్యంలో మరో రూ.50 వేల కోట్ల అదనపు నిధులను రక్షణ రంగానికి కేటాయించాలని.. వాటిని అవసరమైన ఆయుధాలు, పరికరాల కొనుగోలుతో పాటు పరిశోధనకు ఉపయోగించే అవకాశాలున్నాయని అంటున్నారు.